న్యూఢిల్లీ, జూలై 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ వాటా కింద రావాల్సిన ఐజీఎస్టీ బ కాయిల అంశాన్ని పరిష్కరించాలని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు కోరారు. మంగళవారం న్యూఢిల్లీలోని విజ్జాన్ భవన్లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షత జరిగిన 50వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశానికి హాజరైన మంత్రి పలు అంశాలను లేవనెత్తారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఐజీఎస్టీ బకాయిల అంశాన్ని పరిష్కారించాలని చాలా కాలంగా కోరుతున్నా ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు. మ హారాష్ట్రకు చెందిన ఒక ట్యాక్స్ పేయర్ తెలంగాణకు రూ. 82 కోట్లు చెల్లించాల్సి ఉన్నదని తెలిపారు. ఆ ట్యాక్స్ పేయర్ కూడా దీనిని అంగీకరించారని పేర్కొన్నారు. తనకు రీఫండ్ రాగానే చెల్లిస్తామని క్లారిటీ ఇచ్చినా ఇంకా పెండింగ్లోనే ఉండిపోయిందని వివరించారు. గతంలో హామీ ఇచ్చినట్టుగా ఇలాంటి అంశాల సత్వర పరిష్కారానికి వెంటనే అధికారుల బృందాన్ని కానీ, మంత్రుల బృందాన్ని కానీ ఏర్పాటు చేయాలని సూచించారు.
ఈ ప్రతిపాదనకు మంత్రి నిర్మల సానుకూలంగా స్పందించినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని కోరుతూ ఆమెకు వినతిపత్రం అందించారు. అనంతరం కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను ఆయన నివాసంలో కలిసిన మంత్రి హరీశ్రావు తెలంగాణకు నీటి కేటాయింపులు పెంచాలని కోరుతూ వినతిపత్రం అందించారు. కృష్ణా జలాల్లో ఈ ఏడాది తెలంగాణకు కచ్చితంగా 50 శాతం జలాలు ఇవ్వాలని కోరారు. గోదావరిలో పెండింగ్ ప్రాజెక్టులో సీడబ్ల్యూసీ క్లియరెన్స్లు కూడా పెండింగ్లు ఉన్నాయని, సమ్మక్క బ్యారేజీ, సీతారామ ప్రాజెక్టులకు, సెకండ్ టీఎంసీకి సంబంధించినటువంటి అంశాలు, 3 టీఎంసీలకు సంబంధించిన అంశాలు వంటి వాటికి వెంటనే క్లియరెన్స్ ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. డెడ్ స్టోరేజీ నీటిని వాడుకునేలా ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును నిర్మిస్తున్నదని, దీని వల్ల గోదావరి జలాల్లో హక్కును కోల్పోయే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని మంత్రిని కోరినట్టు హరీశ్రావు వివరించారు.