గజ్వేల్/కొండపాక, నవంబర్ 28: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నదని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పాటైన కుకునూర్పల్లి మండల తహసీల్ కార్యాలయాన్ని, తెలంగాణతల్లి విగ్రహాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డితో కలిసి మంత్రి హరీశ్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. కేసీఆర్ చేస్తున్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేక బీజేపీ నాయకులు టీఆర్ఎస్ ప్రభుత్వంపై అబద్ధాలతో దుష్ర్పచారం చేస్తున్నారన్నారు.
రాష్ర్టానికి కేంద్ర నుంచి రావాల్సిన రూ.15వేల కోట్ల ఎఫ్ఆర్బీఎం నిధులను అడ్డుకోవడంతో పాటు రైతుల వ్యవసాయ బావుల వద్ద మీటర్లను ఏర్పాటు చేయడం లేదని మరో రూ.6వేల కోట్ల నిధుల చెల్లింపులను నిలిపివేసి తెలంగాణ ప్రభుత్వాన్ని ఇబ్బందులపాలు చేస్తున్నదన్నారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన, అభివృద్ధి పథంలో నిలిపిన నాయకుడిగా సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంతో పోరాడుతున్నారని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో తెలంగాణ లెక్క ఎందుకు అభివృద్ధి జరుగుతలేదో ప్రతిపక్ష నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. పరిపాలనా సౌలభ్యం కోసం కేసీఆర్ కొత్త జిల్లాలు, మండలాలను ఏర్పాటు చేశారని చెప్పారు.