Minister Harish Rao | కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డే చెప్పిండు. రూ.50 కోట్లు పెట్టి రేవంత్రెడ్డి పీసీసీ పదవి కొన్నడని. రూ.50 కోట్లు ఇచ్చింది నిజమైతే ఎవరికి ఇచ్చారో రాహుల్గాంధీ బయపట్టాలి. అది నిజం కాకపోతే ఆ ఆరోపణ చేసిన కోమటిరెడ్డి మీద చర్య తీసుకోవాలి. ఆయన మీద చర్య తీసుకోరు. ఈయన ఎవరికి డబ్బులు ఇచ్చాడో చెప్పరు. దీన్ని బట్టి అర్థమయ్యేదేమిటంటే కోమటిరెడ్డి చెప్పింది నిజం అని.
– మంత్రి హరీశ్రావు
ఆదిలాబాద్, జనగామ అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ద్రోహుల చేతిలో కాంగ్రెస్ ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధును ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఆ పార్టీని బొందపెట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. రైతులంటే హస్తం పార్టీకి మొదట్నుంచీ పగ అని, అందుకే పెట్టుబడి సాయాన్ని ఆపాలని ఈసీకి లేఖ రాసిందని మండిపడ్డారు. ఆదిలాబాద్, ఉట్నూర్ ప్రజా ఆశీర్వాద సభలు, స్టేషన్ ఘన్పూర్లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి హరీశ్ హాజరయ్యారు. స్టేషన్ఘన్పూర్లో కడియంతో కలిసి ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య ఇంటికి వెళ్లిన మంత్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు అక్కడ తేనీటి విందు స్వీకరించి పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఆయా సభల్లో హరీశ్రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ సెంచరీ కొట్టడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్లో అభ్యర్థులు లేక పక్క పార్టీల వాళ్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నాయకులు టికెట్ల కోసం నెల రోజులుగా ఢిల్లీలో ఉన్నారని, తెలంగాణ ఆత్మగౌరవాన్ని అక్కడ తాకట్టు పెడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టుకుండా, స్వయం పాలన అందించే కేసీఆర్ చేతిలో రాష్ట్రం ఉంటేనే పదిలంగా ఉంటుందని చెప్పారు. ఓటుకు నోటు దొంగల చేతిలో తెలంగాణ ఉండాలా? కేసీఆర్ లాంటి త్యాగధనుడి చేతిలో ఉండాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు.
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీకి ఓటమి తప్పదని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కావటం ఖాయమని హరీశ్ స్పష్టం చేశారు. బీజేపీ గత ఎన్నికల్లో ఒకే అసెంబ్లీ స్థానంలో గెలుపొందిందని, ఈసారి డకౌట్ అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా కూడా రాదన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో ప్రచారానికి వచ్చారని ప్రశ్నించారు. కర్ణాటకలో కరెంటు కోసం రైతులు కరెంటు ఆఫీసుల్లో మొసళ్లను వదులుతున్నారని గుర్తుచేశారు. ఆర్టీసీ కార్మికులను సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారని, కానీ బీజేపీ నాయకులు దీన్ని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. దీనిపై ప్రభుత్వం గెజిట్ విడుదల చేసిందని, జనవరి 1 నుంచి వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులుగా జీతం అందుకుంటారని వెల్లడించారు.
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు అనుకూలమైన నిర్ణయం తీసుకోబోతున్నారని మంత్రి హరీశ్ తెలిపారు. ఈసారి సెంచరీ కొట్టడం ఖాయమని కుండబద్దలు కొట్టారు. పదేండ్లలో రాష్ట్రంలో కరువు లేదు, కర్ఫ్యూ లేదని వెల్లడించారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో తెలంగాణ నంబర్ వన్గా ఉన్నదని వివరించారు. ప్రతి సంవత్సరం 10 వేల మంది డాక్టర్లను దేశానికి అందిస్తున్నదని స్పష్టం చేశారు. కుర్చీల కోసం కొట్లాడేవారి చేతిలో తెలంగాణ పెడితే బాగుపడదని అన్నారు. కాంగ్రెస్లో ప్రతి నియోజకవర్గంలో ముష్టియుద్ధాలు, రాజీనామాలు, దిష్టిబొమ్మల దహనం జరుగుతున్నదని పేర్కొన్నారు. ఆ పార్టీ తెలంగాణ ద్రోహులు, అవినీతిపరుల చేతుల్లోకి వెళ్లిందని విరుచుకుపడ్డారు.
‘ముస్లిం మైనార్టీలకు దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ నిధులు కేటాయిస్తున్నది. ఉత్తరప్రదేశ్లో 4 కోట్ల మంది ముస్లిం జనాభా ఉంటే రూ.400 కోట్లు, బెంగాల్లో 2.40 కోట్ల జనాభా ఉంటే రూ.18 కోట్లు, మహారాష్ట్రలో 1.40 కోట్ల జనాభా ఉంటే రూ.1,600 కోట్లు, కర్ణాటకలో 90 లక్షలు ఉంటే రూ.2,100 కోట్లు కేటాయిస్తే, మన రాష్ట్రంలో 50 లక్షల జనాభాకు రూ.2,200 కోట్లు కేటాయిస్తున్నది’ అని హరీశ్రావు తెలిపారు. కరువుతో విలయతాండం చేసిన స్టేషన్ ఘన్పూర్ ప్రాంతాన్ని గోదావరి జలాలతో సస్యశ్యామలం చేసిన బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ స్వామిగౌడ్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ అభ్యర్థి అనిల్ జాదవ్ పాల్గొన్నారు.