హైదరాబాద్, ఫిబ్రవరి 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 10.2 శాతం నిధులు కేటాయించామని ఆర్థికమంత్రి హరీశ్రావు తెలిపారు. విద్యారంగానికి నిధులు తక్కువ కేటాయించారనటం సరికాదని అన్నారు. గురువారం శాసనమండలిలో బడ్జెట్పై చర్చకు మంత్రి సమాధానమిచ్చారు. సెకండరీ విద్యకు రూ.16,902 కోట్లు, ఉన్నత విద్యకు రూ.3,001 కోట్లతో పాటు, వ్యవసాయశాఖ ద్వారా విద్యకు రూ. 560 కోట్లు, ఫారెస్ట్ కాలేజీకి రూ.106 కోట్లు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమశాఖల ద్వారా మొత్తంగా రూ.29,616 కోట్లను బడ్జెట్లో కేటాయించామని వివరించారు.
బడ్జెట్ను విమర్శించడమంటే రాష్ట్ర ప్రజలకు సంక్షేమ పథకాలు వద్దని చెప్పడమే అవుతుందని విపక్షాలకు చురకలంటించారు. ఆర్టీసీకి ఏటా రూ. 1500 కోట్లు ఇచ్చి కాపాడే ప్రయత్నం చేస్తున్నామని, షాదీముబారక్కు ఈ ఏడాది బడ్జెట్లో అదనంగా నిధులు కేటాయించామని తెలిపారు. ఉద్యోగులకు ఇప్పటికే ఒక డీఏను మంజూరు చేశామని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఆమోదం తీసుకొని మరో రెండు డీఏలు మంజూరు చేస్తామని చెప్పారు. ఉద్యోగాల భర్తీ కొనసాగుతున్న నేపథ్యంలో కొత్తగా ఉద్యోగంలో చేరినవారికి జీతాలివ్వడం కోసం బడ్జెట్లో రూ.1,000 కోట్లు కేటాయించామని వెల్లడించారు.
గంజి.. అంబలి కేంద్రాలున్నాయా?
‘సీఎం కేసీఆర్ ఏది చేసినా మనసు పెట్టి చేస్త రు. ప్రాణంపెట్టి చేస్తరు. చేసే పనిలో పూర్తిగా జీవిస్తరు. నిబద్ధతతో పరిశ్రమిస్తరు. ఆశించిన లక్ష్యాన్ని ధ్యానిస్తరు. ప్రజల ప్రయోజనాన్ని శ్వాసిస్తరు. అందుకే ఆయన అనుకొన్నదాంట్లో తప్పక విజయం సాధిస్తరు. ఇది కేసీఆర్కు ఇతర నేతలకున్న తేడా. రోజుకు 18 గంటలపాటు కష్టపడుతురు కనుకనే ఇన్ని విజయాలు సాధించారు’ అని హరీశ్రావు గుర్తుచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరుతో తెలంగాణ నేడు దేశానికే అన్నంపెట్టే ధాన్యాగారంగా తయారయ్యిందని తెలిపారు. ఒకనాడు అన్నం లేక, ప ని లేక అంబలికేంద్రాలు, గంజికేంద్రాలు ఏర్పాటుచేసేవారని, నేడు అంబలి కేంద్రాలున్నా యా? గంజి కేంద్రాలున్నాయా? చలివేంద్రాలున్నాయా ? ఆకలి చావులున్నాయా? పనుల కోసం వలసలున్నాయా? అని ప్రశ్నించారు.
తెలంగాణ చాంపియన్
గతంలో కాంగ్రెస్ పాలకులు 20 ఏండ్లలో మూడు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. తాము ఒక్క సంవత్సరంలోనే 9 కాలేజీలు ప్రారంభించి చరిత్ర సృష్టించామని మంత్రి హరీశ్రావు తెలిపారు. దేశంలో లక్ష జనాభాకు 19 ఎంబీబీఎస్ సీట్లతో తెలంగాణ చాంపియన్గా నిలిచిందని చెప్పారు. పీజీ మెడికల్ సీట్లల్లో లక్ష జనాభాకు 7 సీట్లతో దేశంలోనే రెండోస్థానంలో ఉన్నామని వెల్లడించారు. ‘గతంలో గరీబోళ్లకు రోగమొస్తే.. గదే గాంధీ దవాఖాన, ఉస్మానియా, నిమ్స్లు తప్ప ఒక్క సూపర్స్పెషాలిటీ దవాఖాన అయినా ఏర్పాటు చేసిండ్రా? గాంధీయేమో బ్రిటిషోళ్లు, ఉస్మానియా నిజాం ప్రభువు కట్టింది. నిమ్స్ దవాఖాన నిజాం విరాళమిస్తే కట్టిందే తప్ప టీడీపీ, కాంగ్రెస్ ఒక్కటన్న కట్టే ఆలోచన చేసినయా?’ అని ప్రశ్నించారు. వరంగల్ హెల్త్సీటీని రూ.1,200 కోట్లతో నిర్మిస్తున్నామని, ఇటీవలే శ్రీహరి అంకుల్ (కడియం శ్రీహరి)తో కలిసి నిర్మాణ పనులను పరిశీలించామని తెలిపారు. దవాఖాన 10 ఫ్లోర్ల నిర్మాణం పూర్తయిందని, వచ్చే దసరా పండుగనాటికి 24 అంతస్తుల్లో 2 వేల పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన సేవలందించేందుకు సిద్ధమవుతుందని చెప్పారు.
నాడు ఎండిన చెరువులు.. నేడు నిండు కుండలు
ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో నీటికోసం ఎంత గోసపడ్డామో కాంగ్రెస్ నేత జీవన్రెడ్డికి తెలియదా? అని మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. ‘జగిత్యాల పట్టణానికి గతంలో తాగునీరు కావాలంటే ఎస్సారెస్పీ నుంచి వదలాలి. నీళ్లు వదిలితే బాల్కొండవాళ్లో.. మెట్పల్లి వాళ్లో కాల్వల్లో పైపులేసి నీళ్లు గుంజితే ఎమ్మార్వోలు, ఎస్ఐలు పైపులు కోసుడు.. మోటర్లు జీపుల్లో వేసుకొచ్చుడు.. రైతులు రోడ్లమీదికొచ్చుడు జరిగేది. తాగునీరు లేక పల్లెలు, పట్టణాలు ఎంత ఇబ్బందిపడ్డవో నాడు మంత్రిగా ఉన్న జీవన్రెడ్డికి తెలియనిదా? నాడు ఎండిన చెరువులెందుకున్నయి? నేడు నిండిన చెరువులెందుకున్నయి? ప్రాజెక్టులతో చెరువులను అనుసంధానం చేయడంవల్లే మండుటెండల్లోనూ చెరువులను నిండు కుండల్లా చూడగలుగుతున్నాం. గతంలో చిన్న వానలకే చెరువులు తెగిపోయేవి. నేడు 500 ఏండ్లలో పడనంత వానపడ్డా ఒక్క చెరువు కట్ట కూడా తెగకపోవడం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ ఉన్నంతకాలం ఢోకా లేదు
ఈ మధ్య నేను మహబూబ్నగర్ జిల్లాకు పోయిన. ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి పేదింటి పిల్లలకు పెండిళ్లు చేస్తుంటే పోయిన. పోతూపోతూ మధ్యలో ఓ దగ్గర గొర్లమందతో కొంత మంది రైతులు కనపడితే ఆగి పలకరించిన. ఏం అంతా బాగున్నరా? అంతా మంచిదేనా? అని అడిగితే.. నీళ్లు ఫుల్లు.. చేపలు ఫుల్లు. పంటలు ఫుల్లు. మాకేం డోకాలేదు.. మా కేసీఆర్ ఉన్నంత కాలం మాకు ఢోకాలేదు అని మల్లయ్య అనే రైతు అన్నడు. ఇది తెలంగాణలోని ప్రతి రైతు మాట. ఈ మాటలు ప్రతిపక్షాలకు కనబడుతలేవు.. వినపడుతలేవు.
-ఆర్థికమంత్రి హరీశ్రావు
కేంద్ర బడ్జెట్లో కోతలు తప్ప మరేం లేదు
కేంద్ర బడ్జెట్లో కోతలు తప్ప మరేమీ లేవని మంత్రి హరీశ్రావు విమర్శించారు. బడ్జెట్లో కేంద్రం రాష్ర్టానికి ఇచ్చింది సున్నా అని ఆరోపించారు. సీసీఐకి కేంద్రం బడ్జెట్లో రూ.1 లక్ష మాత్రమే కేటాయించిందని, దీని ద్వారా.పత్తి రైతులకు కేంద్రం ఏం చెప్పాలనుకొంటున్నదని ప్రశ్నించారు. రైతులకు మద్దతు ధర విషయంలో కేంద్రం మొండిచెయ్యి చూపిందని, రైతుల పట్ల కక్ష గట్టిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడినందుకే రైతులపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీజేపీ పాలనతో రైతుల ఆదాయం రెట్టింపు కాలేదు కానీ.. ఖర్చు మాత్రం రెండింతలయ్యిందని దుయ్యబట్టారు. రైతులకు కోతలు పెట్టి కార్పొరేట్లకు దోచిపెట్టారని ఆరోపించారు. మోదీ సర్కారు కార్పొరేట్ కంపెనీలకు రూ.13.34 లక్షల కోట్లు మాఫీ చేసిందని అన్నారు.