సిద్దిపేట, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): తెలంగాణకు ముఖ్యమంత్రి కేసీఆరే శ్రీరామరక్ష అని, కేసీఆర్ అంటేనే గ్యారంటీ, వారంటీ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు మాటలు చెప్తారని, సీఎం కేసీఆర్ చేతల్లో చూపిస్తారని తెలిపారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహాన్ని మంగళవారం ఆయన సిద్దిపేటలో ఆవిష్కరించారు. సిద్దిపేట కేసీఆర్నగర్లో బీసీ కార్పొరేషన్ సౌజన్యంతో నిర్మిస్తున్న ఆధునిక యంత్రాలతో కుండల తయారీ పరిశ్రమ, కుమ్మరి కుల వృత్తుల శిక్షణ కేంద్రం నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ‘ఐలమ్మ అంటేనే ఉద్యమస్ఫూర్తి. పేదల పక్షాన పోరాడిన వీర వనిత. ఐలమ్మ స్ఫూర్తితోనే సీఎం కేసీఆర్ పోరాటం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించారు’ అని వివరించారు. తొమ్మిదేండ్ల కింద తెలంగాణ ఎట్లుండెనో, ఇప్పుడు ఎలా ఉన్నదో ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఎంతోమంది ఉద్యమకారులను గుర్తించి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహిస్తున్నదని తెలిపారు.
రజకులను పట్టించుకోని కాంగ్రెస్
టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు రజకులను పట్టించుకోలేదని హరీశ్రావు విమర్శించారు. దేశంలో లాండ్రీలకు ఉచితంగా కరెంట్ ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. సీఎం కేసీఆర్ బీసీలకు అందజేస్తున్న ఆర్థిక సాయం పథకాన్ని మోదీ కాపీ కొట్టారు. కానీ మోదీ ఇచ్చేది అప్పు. సీఎం కేసీఆర్ ఇచ్చేది పూర్తిగా ఉచితం. రైతుబంధు, మిషన్భగీరథ లాంటి పథకాలను కూడా మోదీ కాపీ కొట్టారు’ అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ రెండేండ్లలోనే మిషన్ భగీరథను పూర్తి చేస్తే.. పదేండ్లయినా కేంద్ర ప్రభుత్వం 30% కూడా నీళ్లు ఇవ్వలేదని చెప్పారు. ఎన్నికలు సమీపిస్తే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మాయమాటలు చెప్తారని వారిని నమ్మవద్దని విజ్ఞప్తిచేశారు.
కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్కరి పెండ్లికైనా కనీసం రూ.10 వేల ఆర్థిక సహాయం చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో 12 లక్షల మంది పెండ్లిళ్లకు ఆర్థిక సహాయం అందజేశామని, సద్దితిన్న రేవు తలవాలని, సీఎం కేసీఆర్ను ఆశీర్వదించాలని కోరారు. గతంలో బ్యాంకుల చుట్టూ రైతులు తిరిగేవారని, ఇవాళ బ్యాంకర్లే రైతుల చుట్టూ తిరుగుతున్నారని, సీఎం కేసీఆర్ రైతుల విలువ పెంచారని వివరించారు. కేంద్ర ప్రభుత్వ పక్షపాత ధోరణి వల్ల తెలంగాణకు హక్కుగా రావాల్సిన రూ.లక్ష కోట్లు రాలేదని మండిపడ్డారు. అతి తక్కువ వేతనాలు ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఉన్నాయని, చూసేందుకు వెజ్ గవర్నమెంట్ కానీ చేసేందుకు నాన్-వెజ్ గవర్నమెంట్ అంటూ బీజేపీ ప్రభుత్వ తీరును ఎద్దేవాచేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్ కొత్త పీఆర్సీ వేస్తారని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, మాజీ ఎంబీసీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, సిద్దిపేట జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ పాల్గొన్నారు.