హైదరాబాద్, జనవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఈసారి పూర్తిస్థాయి బడ్జెట్కు బదులు ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రాష్ట్ర బడ్జెట్పై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. ఈ నెల 9వ తేదీలోపు సమగ్రంగా ప్రతిపాదనలు పంపాలని కోరుతూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు 52 పేజీలతో కూడిన విధివిధానాలను అన్ని ప్రభుత్వ శాఖలకు పంపారు. ఈ నేపథ్యంలో ఆయా శాఖల ప్రతిపాదనలు సచివాలయానికి చేరాయి.
వీటిని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి శుక్రవారం సాయంత్రంలోగా ఆర్థిక శాఖకు అందజేయనున్నారు. బడ్జెట్ కోసం కొత్త ప్రతిపాదనలు ఏమీ పంపొద్దని ఆయా శాఖలకు ఆర్థిక శాఖ సూచించింది. కొత్త పథకాలకు అయ్యే వ్యయం ఎంత? అనే అంశంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలు మారిన నేపథ్యంలో గత ప్రభుత్వం అమలుచేసిన పథకాలు కొనసాగించాలో వద్దో నిశితంగా పరిశీలించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆర్థికశాఖకు ప్రభుత్వం సూచించినట్టు తెలిసింది.
కొత్త పథకాలను ఎప్పటినుంచి అమలు చేయాలి? 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఎంత ఖర్చవుతుంది? అనే అంశాలపై ఆర్థిక శాఖ అంచనాలు రూపొందిస్తున్నది. 2014 జూన్ 2 నుంచి 2023 డిసెంబర్ 30 వరకు కొత్తగా అమల్లోకి తెచ్చిన పథకాలు ఏమిటి? వాటి అమలు కోసం ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఎంత ప్రతిపాదించారు? అందులో ఎంత ఖర్చు చేశారు? అనే వివరాలపై ఆర్థిక శాఖ దృష్టి సారించింది. పూర్తి స్థాయి బడ్జెట్కు సంబంధించిన ఫార్మట్లోనే అన్ని శాఖల నుంచి ఆర్థిక శాఖ వివరాలు సేకరించింది. అయినప్పటికీ, ఈ సారికి ఓట్ ఆన్ బడ్జెట్కే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్టు విశ్వనీయ వర్గాల సమాచారం.