హైదరాబాద్ : రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో మరో ముందడుగు పడింది. కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తును వేగవంతం చేసింది. అన్ని శాఖల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల క్రమబద్దీకరణకు ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలను ఆర్థిక శాఖ కోరుతూ ఉత్తర్వులు జారీ చేసింది. మంజూరైన పోస్టుల్లో రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్కు అనుగుణంగా ఉన్న కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరించనున్నారు. వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని ఆర్థిక శాఖ కోరింది.
ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉండరని మార్చి 9న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శాసనసభ వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఉద్యోగ నియామక నోటిఫికేషన్ల ప్రకటన సందర్భంగా ఈ విషయాన్ని కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలోని 11,103 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
రాష్ట్రం ఏర్పాటైన కొత్తలోనే 2014 జూన్ 2 నాటికి కాంట్రాక్టు ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని మానవీయ దృక్పథంతో ప్రభుత్వం రెగ్యులరైజ్ చేయాలని నిర్ణయించింది. అయితే కొన్నిరాజకీయ పార్టీలు సంకుచిత మనస్తత్వంతో కోర్టులో కేసులు వేసిన నేపథ్యంలో హైకోర్టు జారీ చేసిన తాత్కాలిక ఉత్తర్వుల కారణంగా ఈ ప్రక్రియ మధ్యలో నిలిచిపోయింది. ప్రభుత్వం పట్టు విడవకుండా న్యాయ పోరాటం చేసింది. ప్రభుత్వ పోరాటం ఫలితంగా గతేడాది డిసెంబరు 7న సంబంధిత రిట్ పిటిషన్లను కొట్టివేస్తూ హైకోర్టు ఆదేశాలను వెలువరించింది. అవరోధాలన్నీ తొలగిపోయిన నేపథ్యంలో కాంట్రాక్టు ఉద్యోగుల సేవలను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తున్నది. ఇక పై రాష్ట్రంలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగ నియామకాలుండవు అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.