కోల్కతా: తల్లిదండ్రులు, సోదరి, నానమ్మను మూడు నెలల కిందట హత్య చేసిన ఒక యువకుడ్ని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ మాల్దా జిల్లాలోని పాత 16 మైలు గ్రామానికి చెందిన 19 ఏండ్ల ఆసిఫ్ మహ్మద్ ఫిబ్రవరి 28న తల్లిదండ్రులు, సోదరి, నానమ్మను నీటిలో ముంచి చంపేశాడని, తమ ఇంటి సమీపంలో ఉన్న గోడౌన్ వద్ద వారి మృతదేహాలను పూడ్చిపెట్టాడని అతడి అన్న ఆరిఫ్ శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల భయంతో తాను ఇప్పటి వరకు ముందుకు రాలేదని, ఇప్పుడు తనను కూడా చంపేందుకు ప్రయత్నించగా తప్పించుకున్నట్లు తెలిపాడు. దీంతో పోలీసులు వారిద్దరిని ప్రశ్నించారు.
కాగా, తన తల్లిదండ్రులు కోల్కతాలో కొనుగోలు చేసిన కొత్త ఇంటిలో ఉండేందుకు అక్కడకు వెళ్లారని పోలీసులకు ఆసిఫ్ చెప్పాడు. మరోవైపు అతడి కుటుంబ సభ్యులు గత మూడు నెలలుగా కనిపించడం లేదని స్థానికులు వెల్లడించారు. పది పాసైన ఆసిఫ్ తాను ఒక యాప్ తయారు చేస్తానని, అది తనను ధనవంతుడ్ని చేస్తుదంటూ లాప్టాప్ కొని ఇమ్మని అడిగాడని, పేరెంట్స్ నిరాకరించడంతో ఇంటి నుంచి వెళ్లిపోయాడని చెప్పారు.
అయితే ఆసిఫ్ తిరిగివచ్చిన తర్వాత ఖరీదైన కంప్యూటర్తోపాటు మొబైల్ ఫోన్ కొని ఇచ్చారని తెలిపారు. కొన్ని ఆస్తులను అమ్మేందుకు ఇటీవల అతడు ప్రయత్నం చేస్తున్నట్లు వెల్లడించారు. మరోవైపు పోలీసులు గోడౌన్ వద్ద తవ్వించి మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.