సిద్దిపేట, జూన్ 25 (నమస్తే తెలంగాణ)/సిద్దిపేట అర్బన్: దళితుల సముద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళితబంధు పథకం ఒక విప్లవం అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణలో అమలు అవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని చెప్పారు. కల్యాణలక్ష్మి పథకం కూడా దళితుల కోసమే తీసుకొచ్చామని, తర్వాత అందరికీ ఇస్తున్నట్టు తెలిపారు. ఆదివారం సిద్దిపేటలో విపంచి కళానిలయంలో జరిగిన ఇంటర్నేషనల్ దళిత్ జర్నలిస్ట్ నెట్వర్క్ (ఐడీజేఎన్) సమావేశంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, శ్రీనివాస్గౌడ్, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్, మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణతో కలిసి మంత్రి హరీశ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ దఫాలో దళిత జర్నలిస్టులకు కూడా దళితబంధును ఇస్తామని వెల్లడించారు. దళిత జర్నలిస్టులు సమాజాన్ని చైతన్యవంతం చేసి ఐక్యత తీసుకురావాలని సూచించారు. హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడితే దేశం మొత్తం గర్వపడుతున్నదని, ఆ ఘనత సీఎం కేసీఆర్దేనని అన్నారు. నీట్ ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ గురుకులాల విద్యార్థులు అద్భుతమైన ర్యాంకులు సాధించారని తెలిపారు. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం ద్వారా రూ.20 లక్షలు ఇస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 22 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు ఉన్నారని పేర్కొన్నారు. మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ప్రపంచంలోనే ఎత్తయిన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడమే కాకుండా, సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టారని, ఇది గొప్ప విషయమని అన్నారు. ఈ సమావేశంలో బుద్ధవనం ప్రత్యేక అధికారి, ఐడీజేఎన్ అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఐడీజేఎన్ తెలంగాణ చాప్టర్ కన్వీనర్గా జనార్దన్, కో కన్వీనర్గా రాజలింగంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ప్రతి వర్గం, వృత్తులు, కులాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిత్యం ఆలోచిస్తున్నారని మంత్రి హరీశ్ అన్నారు. సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో తెలంగాణ మేదరి సంఘం రాష్ట్ర కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి హాజరైన ఆయన మాట్లాడుతూ.. గతంలో మేదరి జాతిని ఎవరూ పట్టించుకోలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం వారిని గుర్తించి ప్రోత్సహించిందని తెలిపారు. సిద్దిపేటలో రాష్ట్రంలోనే తొలి మేదరి సంఘ భవనాన్ని రూ.30 లక్షలతో నిర్మించామని, హైదరాబాద్లోని భవనానికి మరో కోటి రూపాయలు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఎవరూ కులవృత్తులను పట్టించుకోలేదని, అన్ని కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్, సీఎం కేసీఆరే అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వెల్లడించారు. అన్ని కులవృత్తుల బలోపేతానికి సీఎం కేసీఆర్ చర్యలు చేపట్టారని మంత్రి సత్యవతి రాథోడ్ చెప్పారు.
హైదరాబాద్ నగరం హెల్త్ హబ్గా మారిందని, ఇక్కడ చికిత్స పొందేందుకు ఇతర రాష్ర్టాలు, విదేశాల నుంచీ ఎయిర్ అంబులెన్స్ల్లో రోగులు వస్తున్నారని మంత్రి హరీశ్రావు తెలిపారు. ఆదివారం సిద్దిపేటలోని పోలీస్ కన్వెన్షన్ హాల్లో విశ్వ ఆయుర్వేద పరిషత్తు ఆధ్వర్యంలో జరిగిన కృతజ్ఞత సభకు మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆయుర్వేద వైద్యులకు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లలో సేవలందించే అవకాశాన్ని తెలంగాణ ప్రభుత్వం కల్పించిందని గుర్తు చేశారు. కరోనా సమయంలో ప్రపంచమంతా తలకిందులైతే, ఆయుర్వేదం ఒక్కటే భరోసా ఇచ్చిందని తెలిపారు.
సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఆయుర్వేద కళాశాల వైద్య బృందం బ్లాక్ఫంగస్కు మందు కనుగొన్నదని, ఇది తెలంగాణకు గర్వకారణమని అన్నారు. తెలంగాణ రాకముందు 30 శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానల్లో జరిగితే, ఇప్పుడు 70 శాతం ప్రభుత్వ దవాఖానల్లో, 30 శాతం ప్రైవేటు దవాఖానల్లో జరుగుతున్నాయని చెప్పారు. 9 ఏండ్లలో రాష్ట్రంలో 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామని, రాష్ట్రంలో మొత్తం 8,340 మెడికల్ సీట్లు ఉన్నాయని వెల్లడించారు. మెడికల్ సీట్లలో తెలంగాణ వారికే అవకాశం కల్పించేందుకు బీ క్యాటగిరీ సీట్లలో 85 శాతం స్థానికులకే కేటాయించినట్టు వివరించారు. నిజాయితీగా పనిచేసే ప్రభుత్వాన్ని దీవించాలని ఈ సందర్భంగా మంత్రి హరీశ్ కోరారు.
సిద్దిపేట రూరల్, జూన్ 25: బీఆర్ఎస్ పార్టీకి, సిద్దిపేట అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న మంత్రి హరీశ్రావుకు రాబోయే ఎన్నికల్లో అండగా ఉండి భారీ మెజార్టీతో గెలిపిస్తామని సిద్దిపేట జిల్లా మాల ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆత్మీయ తీర్మానం చేసింది. ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్లో ఉద్యోగ కుటుంబాల సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్తో కలిసి మంత్రి హరీశ్రావు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో మంత్రి హరీశ్కు అండగా నిలబడి గెలిపిస్తామని తీర్మానం చేసి, కాపీని అసోసియేషన్ సభ్యులు మంత్రికి అందజేశారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, మాల ఎంప్లాయీస్ యూనియన్ సంఘం అధ్యక్షుడు కనకయ్య, ప్రధాన కార్యదర్శి స్వామిదాస్, డిప్యూటీ తహసీల్దార్ రాజేశం, అసోసియేషన్ సంఘ సభ్యులు కుటుంబాలతో పెద్ద ఎత్తున హాజరయ్యారు.