హైదరాబాద్, మార్చి 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు కేంద్ర ప్రభుత్వం నెల రోజులుగా కూలి డబ్బులు అందడం లేదు. ఫలితంగా రూ.200 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. పూట గడవడానికి కూలి పనిచేసుకొనే కార్మికులు సకాలంలో డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 53 లక్షల జాబ్ కార్డులు జారీ కాగా, ఇందులో 1.11 కోట్ల మంది సభ్యులు ఉన్నారు. వీరు గత నెల రోజుల్లో దాదాపు రూ.200 కోట్ల విలువైన పనులు చేశారు. కూలీలకు చెల్లించే కొద్దిపాటి మొత్తం కూడా కేంద్రం సకాలంలో చెల్లించడంలేదు. కూలీలు చేసే పనులు వందశాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాల్సి ఉంటుంది. ఉపాధి కూలీల కూలిని నేరుగా కేంద్ర ప్రభుత్వమే వారి అకౌంట్లలో జమ చేయాలి. కానీ, బీజేపీ ప్రభుత్వం మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. వేసవిలో ఎండలో కూలీలు పనిచేసినా సకాలంలో డబ్బులు చెల్లించడానికి కేంద్ర ప్రభుత్వానికి చేతులు రావడం లేదు. వెంటనే డబ్బులు రావని, కూలీలు ఇతర పనులకు వెళ్లడం, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం చేస్తున్నారు.
ఉపాధి హామీ ఉద్యోగులకు డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలలకు వేతనాలను కూడా కేంద్రం చెల్లించలేదు. ఉద్యోగుల వేతనాలను సకాలంలో చెల్లించాలని బీఆర్ఎస్ నేతలు కేంద్రానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఉద్యోగులకిచ్చే కొద్దిపాటి వేతనాలను కూడా నెలల తరబడి చెల్లించకపోతే కుటుంబాలు ఎలా గడుస్తాయని నిలదీస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ నేతల ఒత్తిడికి దిగివచ్చిన కేంద్ర సర్కారు ఎట్టకేలకు రాష్ట్రంలోని 12,600 ఉద్యోగుల మూడు నెలల వేతనాల కోసం రూ.73 కోట్లను బుధవారం విడుదల చేసింది.