ఉస్మానియా యూనివర్సిటీ, ఫిబ్రవరి 26: ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగం ఆధ్వర్యంలో ‘రీకన్స్ట్రక్షన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఎమర్జింగ్ ఇష్యూస్, పాలసీ ఇంటర్వెన్షన్స్ అండ్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్’ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సు ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ కళాశాలలో నిర్వహించిన సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా పొంగులేటి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23 వేల ఉద్యోగాలను ఇప్పటికే భర్తీ చేశామని, త్వరలోనే 11 వేల ఉద్యోగాలతో మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారు. వచ్చే నెల 2న వివిధ విభాగాలకు చెందిన ఆరు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నామని వెల్లడించారు. కీలక ఉపన్యాసకులుగా హాజరైన ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. సామాజిక ఉద్యమాలు, సామాజిక మార్పు, ప్రజాస్వామిక ప్రక్రియతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, ప్రముఖ పాత్రికేయుడు కే రామచంద్రమూర్తి, సదస్సు డైరెక్టర్, ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చింత గణేశ్, ఓయూ సోషల్ సైన్స్ డీన్ ప్రొఫెసర్ కే అర్జున్రావు, సోషియాలజీ విభాగం బీవోఎస్ చైర్మన్ ప్రొఫెసర్ విష్ణుదేవ్, సదస్సు కో-డైరెక్టర్ డాక్టర్ రామ్ బీనవేణి షెఫర్డ్, సిద్ధార్థ విద్యాసంస్థల అధినేత డాక్టర్ నాగయ్య, ప్రొఫెసర్ గట్టు సత్యనారాయణ, ప్రొఫెసర్ చెన్న బసవయ్య, డాక్టర్ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.