ఉద్యోగ భర్తీ ప్రక్రియను పూర్తి చేయగా.. ఎంపికైనవారికి కాంగ్రెస్ సర్కారు నియామకపత్రాలు అందజేసింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా బుధవారం అట్టహాసంగా నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి సీఎం రేవంత్రెడ్డి మొత్తం 6,956 మందికి తన చేతులమీదుగా ఆర్డర్ కాపీలు అందజేశారు. స్టాఫ్నర్సుల నియామకం చాలారోజులుగా పెండింగ్లో ఉన్నదని, తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ సమస్యను పరిష్కరించిందని చెప్పుకొచ్చారు.
త్వరలోరెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని, 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నట్టు సీఎం ప్రకటించారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తయ్యిందని ఇక వరుసగా నియామకాలు ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, 7 వేల నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ.500 కోట్ల అదనపు భారం పడుతున్నదని, ఏటా రూ.60 లక్షల మేర ఖర్చవుతుందంటూ ఆర్థిక మంత్రి భట్టి చేసిన ప్రసంగంపై అధికారులు, సభికులు విస్మయం వ్యక్తంచేశారు.
Nursing Officers | హైదరాబాద్, జనవరి 31 (నమస్తే తెలంగాణ): ఏడాదిలోగా రాష్ట్రంలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. త్వరలో 15 వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీచేస్తామని చెప్పారు. వైద్యారోగ్య శాఖలో నర్సింగ్ ఆఫీసర్స్/స్టాఫ్నర్స్ పోస్టులకు ఎంపికైన 6,956 మందికి బుధవారం ఎల్బీస్టేడియంలో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. డిసెంబర్ 7న తాము ఎల్బీస్టేడియంలోనే ప్రమాణం చేసినట్టు గుర్తు చేశారు. అ ప్పుడు తమ కుటుంబసభ్యులు ఎంతో సంతోషించారని చెప్పారు. ఇప్పుడు నర్సింగ్ అభ్యర్థులు నియామక పత్రాలు పొందుతుంటే తాము కుటుంబ సభ్యులుగా మారి ఆ సంతోషాన్ని చూడాలనే ఉద్దేశంతో ఎల్బీ స్టేడియం లో కార్యక్రమం ఏర్పాటు చేశామని చెప్పారు. నిరుద్యోగులకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని మరోసారి స్పష్టం చేశారు. టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేసి కొత్త చైర్మన్, సభ్యులను నియమించామని తెలిపారు. తాము ఉద్యోగాలు భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంటే.. మాజీ మంత్రి హరీశ్రావు శాపనార్థాలు పెట్టారని ఆరోపించారు.
రెండు నెలల్లోనే నియామక పత్రాలు
పుట్టిన పాప దగ్గర నుంచి మనిషి చివరి శ్వాస వరకు ప్రతి ఒక్కరి ఆరోగ్య అవసరాల్లో వెన్నంటి ఉండేది నర్సులేనని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. తాము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే దాదాపు ఏడు వేల మందికి నియామక పత్రా లు ఇస్తున్నామని చెప్పారు. వైద్యశాఖలో మరో ఐదు వేల పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్ ఇస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, తుమ్మల నాగేశ్వర్రా వు, కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వేణుగోపాల్ రావు, సీఎస్ శాంతికుమారి, హెల్త్ సెక్రటరీ క్రిస్టీనా జడ్ చొంగ్తు, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఆర్వీ కర్ణణ్ పాల్గొన్నారు.
బట్టీ పట్టని ‘భట్టి’
నర్సింగ్ ఆఫీసర్ నియామక పత్రాల అం దజేత సందర్భంగా డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క తన ప్రసంగం లో తీవ్రంగా తడబడ్డారు. ఆర్థిక మంత్రి అ య్యుండి ఏకంగా నిధులను 15 రెట్లు ఎక్కువగా చెప్పడంతో ‘భట్టి లెక్కలు బట్టీ పట్టలేదనుకుంటా’ అంటూ సెటైర్లు వినిపించాయి.
‘టిమ్స్’ నర్సుల ధర్నా
కొవిడ్ సమయంలో టిమ్స్లో పనిచేసిన నర్సులు బుధవారం ఎల్బీ స్టేడియం వద్ద ధ ర్నా చేశారు. తాము ప్రాణాలు లెక్క చేయకుండా చేసిన సేవలకు గుర్తింపుగా నర్సింగ్ నియామకాల్లో 20 శాతం వెయిటేజీ ఇస్తామని గత ప్రభుత్వం హామీ ఇచ్చిందని కానీ ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
మండుటెండలో తిప్పలు
నియామక పత్రాల కోసం వచ్చిన నర్సింగ్ ఆఫీసర్లకు ఎల్బీ స్టేడియంలో చుక్కలు కనిపించాయి. ఉదయం 9 గంటలకు స్టేడియానికి వచ్చిన అభ్యర్థులు సాయంత్రం 4 గంటల వరకు ఎండలోనే మగ్గాల్సి వచ్చింది. వారికోసం మైదానం మధ్యలో కుర్చీలు వేసిన అధికారులు పైన నీడను మాత్రం కల్పించలేకపోయారు. తల్లులతోపాటు వచ్చిన కొందరు చంటిపిల్లలు అల్లాడిపోవాల్సి వచ్చింది. ప్రేక్షకుల గ్యాలరీకి పైకప్పు ఉన్నప్పటికీ అందులో కూర్చోవడానికి అనుమతి ఇవ్వకపోవడంతో రోజంతా ఎండలోనే ఉండాల్సి వచ్చింది.