హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తేతెలంగాణ):యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా అభివృద్ధి ప్రణాళిక అనే అంశాన్ని ముందుకు తీసుకురావడం శోచనీయమని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన సీఎం రేవంత్రెడ్డికి బహిరంగలేఖ రాశారు. విద్యావైద్యం అన్ని పార్టీల మ్యానిఫెస్టోల్లో ముఖ్యమైన అంశాలుగా ఉన్నప్పటికీ అవి ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదని వాపోయారు.
తీరా బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో 72% ఖాళీలు ఉండటంతో విద్యాప్రగతి కుంటుపడుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి ప్రత్యేకత ఉన్నదని, కానీ సిబ్బందిలేక ర్యాంకింగ్లు పడిపోతున్నాయని చెప్పారు. ప్రభుత్వం యూనివర్సిటీల్లోని ఖాళీలను భర్తీ చేసి ప్రణాళికాబద్ధమైన అభివృద్ధిపై దృష్టిపెట్టాలని కోరారు.