Koppula Eshwar | రేవంత్ ప్రభుత్వానికి విచారణల మీద ఉన్న శ్రద్ధ పథకాల అమలు చేయడంలో లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. విచారణల పేరిట కేసీఆర్ హయాంలో అమలైన గొప్ప పథకాలను పక్కన బెట్టే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మంగళవారం కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి విర్రవీగే మాటలు మాట్లాడటం సరికాదని అన్నారు. ఆయన అధికార పక్షంలో ఉన్నారనే విషయాన్ని గుర్తించుకోవాలన్నారు.
సీఎం రేవంత్ వాడుతున్న భాషకు ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాలని కొప్పుల ఈశ్వర్ అన్నారు. యాసంగి పంటకు నీళ్లివ్వడం ఈ ముఖ్యమంత్రికి చేతనవ్వడం లేదని, ఆసరా పెన్షన్లు నాలుగు వేలు ఇస్తామని చెప్పి, అమలు చేయడంలేదని విమర్శించారు. రైతు బంధుకు దిక్కే లేదని, దళిత బంధును కావాలనే ఆపేశారని ఆరోపించారు. దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ కేసీఆర్ కన్నా మంచి పాలన చేసి చూపాలని సవాలు విసిరారు. కేసీఆర్ హయాంలో తెలంగాణలో అమలైన సంక్షేమ పథకాలు మరెక్కడా అమలు కావడం లేదని అన్నారు. బీఆర్ఎస్ నుంచి వెళుతున్న నాయకులకు ప్రజలే తగిన బుద్ది చెబుతారని స్పష్టం చేశారు. బీఆర్ఎస్లో నాయకులకు కొదవ లేదని, ఎంత మంది వెళ్లినా నష్టం లేదన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ లో చేరడం శుభ పరిణామమని, ఆయనలాంటి వాళ్లు ఇంకెందరో బీఆర్ఎస్లో చేరతారని పేర్కొన్నారు.