హైదరాబాద్, డిసెంబర్ 18 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు ఆ పార్టీ భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా రైతులు బీజేపీకి గోరీ కట్టడం ఖాయమని హెచ్చరించారు. శనివారం ఆయన టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో కలిసి మీడియాతో మాట్లాడుతూ.. రైతులతో రాజకీయాలు చేస్తే పుట్టగతులు ఉండవని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్కు రైతుల్లో మంచి పేరు ఉన్నదన్న ఈర్ష్యతోనే మోదీ ప్రభుత్వం తెలంగాణ పట్ల కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. వడ్ల కొనుగోళ్ల బాధ్యత నుంచి కేంద్రం తప్పుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సోమవారం ఊరూరా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు తెలిపారు. బాగుపడుతున్న రాష్ట్ర రైతులు, ప్రజలపై మోదీ ప్రభుత్వం వివక్ష చూపడం సరికాదని పేర్కొన్నారు. వడ్ల కొనుగోళ్ల విషయంలో కేంద్ర మంత్రులు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రైతుల సమస్యలు తెలియవని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు వారి స్థాయిని, హోదాను మరిచి సీఎం కేసీఆర్పై, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇష్టారీతిగా మాట్లాడితే సహించేది లేదని చెప్పారు. రైతుబంధు పథకం కొనసాగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం రైతులను ఆగమాగం చేస్తున్నదని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల జీవితాలతో ఆటలాడుకోవద్దని హితవు చెప్పారు. పెరుగుతున్న సాగు విస్తీర్ణం, పంటల దిగుబడులకు అనుగుణంగా కేంద్రం గోదాములను నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏడేండ్లలో ఒక్క ఎఫ్సీఐ గోదామునైనా నిర్మించిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో పండిన మొత్తం ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా కేంద్రం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వానకాలం ధాన్యంతోపాటు యాసంగి వడ్లను కూడా కొనుగోలుచేయాలన్న డిమాండ్తో కోటి సంతకాలు సేకరిస్తామని పేర్కొన్నారు. కేంద్రంతో అమీతుమీ తేల్చుకునేందుకే రాష్ట్ర ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్తున్నదని అన్నారు.