హనుమకొండ : హనుమకొండలో బీజేపీ కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అగ్నిపథ్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య తీవ్ర ఘర్షణ తలెత్తింది. ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. బీజేపీ కార్యకర్తలు.. కాంగ్రెస్ నాయకుల వాహనాలను ధ్వంసం చేశారు. ఇరు వర్గాలను నిలువరించేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీఛార్జి చేశారు. బీజేపీ కార్యకర్తల దాడుల్లో సుబేదారి సీఐ గన్మెన్ తలకు గాయాలయ్యాయి. ఇరు పార్టీల కార్యకర్తలు కర్రలతో దాడులు చేసుకోవడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.