లాంఛనంగా ప్రారంభించనున్న సద్గురు
పర్యావరణ పరిరక్షణ కోసం ఒక్కటైన
గ్రీన్ ఇండియా చాలెంజ్, సేవ్ సాయిల్
హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): పర్యావరణ హిత దేశమే లక్ష్యంగా మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్నది. గురువారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొ ల్లూరు ఫారెస్ట్పార్క్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గురు ఐదోవిడతను ప్రారంభించనున్నారు. పుడమిని రక్షించుకుందాం, నేల తల్లి మరింత క్షీణించకుండా కాపాడుకుందాం అంటూ ‘సేవ్ సాయిల్’ ఉద్యమంతో సద్గురు ప్రపంచయాత్ర చేపట్టారు. ఈ యాత్ర బుధవారం హైదరాబాద్ చేరుకొని, 16న కర్నూలు మీదుగా బెంగళూరు వెళ్తుంది. రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ నాలుగేండ్ల కిందట చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొనేందుకు సుముఖత తెలిపిన సద్గురు, గురువారం ఐదో విడత గ్రీన్ఇండియా చాలెంజ్ను ప్రారంభిస్తారు. క్షీణించిన అటవీ ప్రాంతానికి పునరుజ్జీవం కల్పించటంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అటవీశాఖ గ్రీన్ఇండియా చాలెంజ్తో కలిసి నిర్వహిస్తున్నది. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్రెడ్డి, సబితాఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పాల్గొననున్నారు.
నాలుగేండ్లలో అనేక కార్యక్రమాలు
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మానసపుత్రిక ‘తెలంగాణకు హరితహారం’ స్ఫూర్తితో 2018లో ఎంపీ సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా చాలెంజ్ను ప్రారంభించారు. ఒక్కరు మూడు మొక్కలు నాటి, మరో ముగ్గురిని మొక్కలు నాటాల్సిందిగా చాలెంజ్ విసరటమే ఈ కార్యక్రమ స్పూర్తి. ఇది ప్రారంభమైన అనతికాలంలోనే దేశవ్యాప్తంగా ఉద్యమరూపం దాల్చింది. అనేక రంగాల ప్రముఖులను ఏకతాటిపైకి చేర్చి హరిత స్ఫూర్తిని నింపింది గ్రీన్ ఇండియా చాలెంజ్ కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, గుజరాత్ నుంచి అస్సాం దాకా నలుదిక్కులకు వ్యాపించింది. మొక్కలు నాటడం, పచ్చదనం పెంచటం ఉద్యమస్పూర్తితో కొనసాగుతున్నది. గత నాలుగేండ్లలో గిన్నిస్ రికార్డుతో పాటు ముక్కోటి వృక్షార్చన, ఊరూరా జమ్మిచెట్టు వంటి వినూత్న కార్యక్రమాలతో కోట్లాది మొక్కలను నాటడం, సంరక్షించటం, అటవీ ప్రాంతాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేయటం వంటి కార్యక్రమాలను గ్రీన్ ఇండియా చాలెంజ్ చేపట్టింది. పుట్టినరోజుతో పాటు ఏ ఇంట ఎలాంటి వేడుక జరిగినా మొక్కనాటి పండగ చేసుకోవటం ఇప్పుడు ఆనవాయితీగా మార్చటంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ విజయవంతమైంది.
ఒకేరోజు పదివేల మొక్కలు
గ్రీన్ ఇండియా చాలెంజ్, సేవ్ సాయిల్ సంయుక్తంగా నిర్వహించే కార్యక్రమానికి వచ్చే ప్రముఖులు, గ్రీన్ ఇండియా చాలెంజ్ ప్రేమికులు, సద్గురు మార్గాన్ని అనుసరిస్తున్న అభిమానులు ఈ వేదికగా ఒకేసారి పదివేల మొక్కలు నాటనున్నారు. ఐదో విడతలో గ్రీన్ ఇండియా చాలెంజ్లో దేశవ్యాప్తంగా భిన్నవర్గాల భాగస్వామ్యం పెంచేందుకు కృషి చేస్తామని ఎంపీ సంతోష్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు.