హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): జ్వర సర్వే.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కొవిడ్పై రూపొందించిన బ్రహ్మాస్త్రం! కొవిడ్ రెండోవేవ్లో ఈ అస్త్రం అద్భుత ఫలితాలు ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గతేడాది మే ఆరో తేదీ నుంచి తెలంగాణలో ఫీవర్ సర్వే మొదలైంది. సర్వే ప్రారంభం నాటికే 20 లక్షలకు పైగా కిట్లను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. దాదాపు 30 వేల బృందాలు రాష్ట్రవ్యాప్తంగా సుమారు కోటి ఇండ్లల్లో సర్వే చేశాయి. జ్వరం, జలుబు, దగ్గు, గొంతునొప్పి వంటి కొవిడ్ లక్షణాల్లో ఏది ఉన్నా ఐసొలేషన్ కిట్లను అందజేశారు. లక్షణాలు తీవ్రంగా ఉంటే కొవిడ్ ఓపీకి తరలించి, చికిత్స చేయించారు. ఫలితంగా రాష్ట్రంలో కరోనా కేసులు 50 శాతానికిపైగా తగ్గాయి. తొలి విడత జ్వర సర్వేకు ముందు మే 4, 2021న రాష్ట్రంలో 6,361 నమోదైతే.. సర్వే అనంతరం మే 20న కేసుల సంఖ్య 3,660కి.. అంటే దాదాపు సగానికి తగ్గిపోయింది. ఇదే ఉత్సాహంతో రెండు, మూడో విడత జ్వర సర్వే సైతం నిర్వహించారు. దీంతో రాష్ట్రం సెకండ్ వేవ్ నుంచి అతి తక్కువ నష్టంతో బయటపడగలిగింది.
తెలంగాణలో జ్వర సర్వే సక్సెస్ కావడంతో గతేడాది మే 15న ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించి దేశవ్యాప్తంగా ఇంటింటి సర్వే చేయాలని సూచించారు. అంతకు రెండు రోజుల ముందే కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలంగాణలో జరుగుతున్న ఇంటింటి సర్వే వివరాలను సేకరించారు. కొవిడ్ కట్టడికి రాష్ర్టాలు అమలుచేసిన అత్యుత్తమ విధానాలను వివరిస్తూ గతేడాది నీతి ఆయోగ్ ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో జ్వర సర్వేను ‘బెస్ట్ ప్రాక్టీస్’గా వర్ణించింది. ఈ సర్వే ఫలితంగా కరోనా వ్యాప్తిని ప్రాథమిక దశలోనే కట్టడి చేయగలిగారని ప్రశంసించింది. ఇటువంటి చర్యలతో దవాఖానల్లో చేరికలను, వైద్య వ్యవస్థపై ఒత్తిడిని ఒత్తిడి తగ్గించవచ్చని నిరూపించిందని అభినందించింది.
ఎకనామిక్ సర్వే 2020-21 సైతం కొవిడ్ను సమర్థంగా ఎదుర్కొన్న రాష్ట్రంగా తెలంగాణను ప్రశంసించింది. దేశంలో పటిష్ఠమైన కార్యాచరణ అమలు చేసి ప్రజల ప్రాణాలు కాపాడిన మూడు రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటని కీర్తించింది. తెలంగాణలో ముందస్తు అంచనాల కన్నా దాదాపు 3.75 లక్షల కేసులు, 2,300 మరణాలు తగ్గాయని వెల్లడించింది.