హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాల అవసరాలను బట్టి ఎరువులు సరఫరా చేస్తున్నామని, తెలంగాణకు ఈ వానకాలం సీజన్లో 10.50 లక్షల మెట్రిక్ టన్నులు కేటాయించామని కేంద్ర ఎరువులు, రసాయనాలశాఖ మంత్రి భగవంత్ చెప్పారు. టీఆర్ఎస్ లోక్సభా పక్షనేత నామా నాగేశ్వర్రావు అడిగిన ప్రశ్నకు శుక్రవారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2022 వానకాలం సీజన్లో దేశవ్యాప్తంగా 179.01 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరం ఉన్నదని ప్రతిపాదనలు అందాయని చెప్పారు. తెలంగాణకు 10.50 లక్షల మెట్రిక్ టన్నులు, పంజాబ్కు 14.30, ఉత్తరప్రదేశ్కు 38.50, గుజరాత్ 11.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉన్నదని కేంద్రమంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల ఇండెంట్ ఆధారంగా ఎరువులు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
హైకోర్టులో 15 జడ్జి పోస్టులు ఖాళీ
తెలంగాణ హైకోర్టులో 15 న్యాయమూర్తుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెణ్రిజిజు పేర్కొన్నారు. శుక్రవారం చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి లోక్సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. రాష్ట్ర హైకోర్టులో 42 మంది న్యాయమూర్తులకు 27 మంది ఉన్నారని, 15 పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు.