రాష్ట్రంలో ఎరువుల పరేషాన్ మళ్లీ మొదలైంది. యూరియా కోసంరైతు బారులు తీరకతప్పని పరిస్థితి నెలకొన్నది. సరిపడినంత యూరియా లేదని, ఒక్కొక్కరికి కేవలం రెండు బస్తాలు మాత్రమే ఇస్తున్నారు అధికారులు. దానికోసమూ గంటల తరబడి వేచిచూడక తప్పడం లేదు. లేదంటే ప్రైవేటు డీలర్లను ఆశ్రయించాల్సి వస్తున్నది. రాష్ర్టాలకు సరఫరా చేస్తున్న ఎరువుల్లో కేంద్రం భారీగా కోత పెట్టింది. ఎంత తక్కువ ఎరువులు వాడితే అంత ప్రోత్సాహకాలిస్తామంటూ స్పష్టంచేసింది. ప్రోత్సాహకాల మోజులో వత్తిళ్లకు తలొగ్గిన రాష్ట్రం ఉన్న కోటాలోనే సర్దుకుపోయేందుకు సిద్ధమైంది.
మల్యాల, జనవరి 23: రైతులకు యూరియా కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. ఉమ్మడి రాష్ట్రంలో అనుభవించిన కష్టాలు.. స్వరాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు హయాంలో పునరావృతం అవుతున్నాయి. జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని నూకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద మంగళవారం యూరియా కోసం రైతన్నలు బారులుతీరిన దృశ్యమే ఇందుకు నిదర్శనం. యూరియా బస్తాల కోసం కార్యాలయం ఎదుట రైతులు గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొన్నది. మల్యాల మండల వ్యాప్తంగా వరద కాలువకు ఇటీవల ఎస్సారెస్పీ నుంచి నీళ్లు వదలడంతో వరి ఎక్కువగా సాగు చేశారు.
మొదటి దశలో యూరియా చల్లుకునేందుకు రైతులు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఆగ్రోస్ కేంద్రాలు, ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే నూకపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం సుమారు 200 మంది రైతులు నిరీక్షించారు. అధికారులు ఈ సంఘానికి 450 బస్తాలు పంపించగా.. ప్రతీ రైతుకు 2 బస్తాల చొప్పున పంపిణీ చేశారు. మరికొందరు రైతులు తమ అవసరం మేరకు యూరియా బస్తాలు అందకపోవడంతో వెనుదిరిగారు.
జిల్లా స్థాయి గోదాముల్లో సమృద్ధిగా నిల్వలు ఉన్నప్పటికీ డిమాండ్కు తగ్గ సైప్లె లేక ప్రైవేట్ డీలర్లను ఆశ్రయిస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకున్న ప్రైవేట్ డీలర్లు.. జింక్ బస్తా లేదా ఘంట గోలీలు కొంటేనే యూరియా ఇస్తామని షరతులు పెడుతున్నారు. యూరియా కొరత ఉన్న విషయమై ‘నమస్తే తెలంగాణ’ జగిత్యాల జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించగా వెంటనే జిల్లా వ్యవసాయాధికారి, మార్క్ఫెడ్ డీఎం, డీసీవో, జిల్లా సహకార అధికారి, తహసీల్దార్ నూకపల్లి వ్యవసాయ ప్రాథమిక సహకార సంఘానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సహకార సంఘం పరిధిలో యూరియా కొరత లేకుండా తక్షణమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.