Prajavani | జగిత్యాల కలెక్టరేట్, ఫిబ్రవరి/రాయికల్ 12: సర్కారు బడుల్లోనూ ఫీజులు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థిని తల్లిదండ్రులు పేర్కొన్నారు. సోమవారం వారు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా.. రాయికల్ మండలం కట్కాపూర్కు చెందిన ఎండీ ఆస్మా-ఎండీ చాంద్పాషా దంపతులకు ఇద్దరు పిల్లలు. వారు కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి బాగాలేక పెద్ద కూతురు ఎండీ లాస్యను గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో మూడో తరగతి చదివిస్తున్నారు.
పాఠశాలలో నలుగురు ఉపాధ్యాయులు ఉన్నా ముగ్గురు విద్యావలంటీర్లను నియమించుకున్నారు. వలంటీర్లకు జీతాల కోసం ఒక్కొక్కరు నెలకు రూ.700 ఫీజు కట్టాలని హెచ్ఎం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నారు. ఫీజు కట్టలేదని తమ కూతురు లాస్యకు హాల్ టికెట్ ఇవ్వకుండా చాలా సేపు ఎండలో నిలబెట్టినట్టు వారు పేర్కొన్నారు. బలవంతంగా ఫీజులు వసూలు చేస్తున్న హెడ్మాస్టర్పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ఫీజులు వసూలు చేయడం లేదు..
కట్కాపూర్ ఎంపీపీఎస్లో విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయడం లేదు. ప్రజావాణిలో ఫిర్యాదు అందిన వెంటనే స్కూల్కు వెళ్లాం. పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లితండ్రులను విచారించాం. ఫీజుల వసూలు అనేది అంతా అబద్ధం. డబ్బులు ఎవరూ వసూలు చేయడం లేదని తేలింది.
– జగన్మోహన్రెడ్డి, డీఈవో