ప్రభుత్వానికి విద్యాకమిషన్ చేసిన వింత సిఫారసులు విస్తుగొల్పుతున్నాయి. తాజాగా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ రద్దు చేయాలంటూ చేసిన ప్రతిపాదన దుమారం రేపుతున్నది.
హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): ‘ఫీజు రీయింబర్స్మెంట్ పథకం రాష్ట్ర ఆర్థిక భారాన్ని పెంచుతున్నది. రెండేండ్లు పనితీరు సక్రమంగా లేని ప్రైవేటు కళాశాలలకు ఆ పథకాన్ని ఉపసంహరించాలి’ ఇదీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ విద్యా కమిషన్ ఇచ్చిన నివేదికలోని మరో కీలక అంశం. ఇది క్రమక్రమంగా ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ఉపసంహరించాలనే ఎత్తుగడలో భాగమేనని విద్యావేత్తలు, బడుగు, బలహీన వర్గాల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్నది. అంటే ఫీజు రీయింబర్స్మెంట్ ఉపసంహరించిన కళాశాలల్లో చేరిన విద్యార్థులు సొంతంగా ఫీజులు చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి కాంగ్రెస్కే చెందిన వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ సర్కార్ ఆ పథకానికి ఉరితాడును బిగిస్తున్నదన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో కొత్తగా తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీని ఏర్పాటు చేయాలని కమిషన్ సిఫార్సు చేసింది. ఈ అథారిటీ కళాశాలల ప్రమాణాలను అంచనా వేస్తుంది. ప్రమాణాలు తక్కువగా ఉంటే, ఆయా కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ను ఉపసంహరించాలని కమిషన్ తన నివేదికలో సూచించింది.
రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు గుట్టల్లా పేరుకుపోయాయి. ఈ విద్యాసంవత్సరానికి కలిపితే బకాయిలు మొత్తం రూ.12 వేల కోట్లకు పైగా చేరింది. ఏటా రూ.2,500 కోట్లు ఈ పథకం కోసం విడుదల చేయాల్సి ఉండగా, కాంగ్రెస్ సర్కార్ వచ్చాక 10 శాతం నిధులను కూడా విడుదల చేయలేదు. కాలేజీ యాజమాన్యాలు అసొసియేషన్గా ఏర్పడి 2025 సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కాలేజీల నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. కాలేజీల ఆందోళన నేపథ్యంలో సర్కార్ కేవలం రూ.500 కోట్లు మాత్రమే విడుదల చేసింది. బీసీ, ఈబీసీలకు ఇవ్వాల్సిన పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ను రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఇవ్వలేకపోతున్నది. కాలేజీల బంద్ సమయంలో సర్కార్ విజిలెన్స్ నివేదిక, తనిఖీలంటూ యాజమాన్యాలను భయపెట్టింది. కాలేజీలు వెనక్కి తగ్గగానే గప్చుప్ అయింది. మళ్లీ ఇప్పుడు కొత్తగా తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ అథారిటీ పేరిట మరో కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చి, కాలేజీలను భయబ్రాంతులకు గురిచేయాలని చూస్తున్నది.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో రాష్ట్రంలో విద్యావ్యవస్థ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీలన్న తేడాలేకుండా తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. డిగ్రీ కాలేజీలకు రావాల్సిన పెండింగ్ బకాయిల విలువ అక్షరాలా రూ.500 కోట్లు. దీంతో విద్యాపరమైన ఆటంకాలేర్పడుతునాయి. విభిన్న ఆర్థిక, సామాజిక నేపథ్యాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందకపోవడంతో పార్ట్టైమ్ జాబ్లు, అనధికారిక పనుల్లోకి వెళ్తున్నారు. డ్రాపౌట్ల సంఖ్య పెరుగుతున్నది. ఖాళీ సీట్లు ఉంటున్నాయి. ప్రైవేట్ డిగ్రీ కాలేజీలు సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అధ్యాపకులకు జీతాలు, రోజువారీ కార్యకలాపాల కోసం ఇక్కట్ల పాలవుతున్నాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల గైర్హాజరు అతిపెద్ద సవాల్గా మారింది. 60 శాతం విద్యార్థులు కాలేజీలకు డుమ్మా కొడుతున్నారు. స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ సకాలంలో అందకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ తరుణంలో ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ను ఉపసంహరించాలనడం అంటే పూర్తిగా ఈ పథకాన్ని నిర్వీర్యం చేయడమే అన్న వాదనలు వినిపిస్తున్నాయి.