హైదరాబాద్, జూలై 5 (నమస్తే తెలంగాణ): ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రటరీ జనరల్ వీ మమత తెలిపారు. సోమవారం సీఎస్ సోమేశ్కుమార్ను కలిసిన అనంతరం తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి బృందం మీడియాతో మాట్లాడింది. పీఆర్సీ కొత్త జీతాలు ఈ నెల నుంచి అందుతాయని, ఈ మేరకు సీఎస్ హామీ ఇచ్చారని తెలిపారు. 2018 జూలై 1 తర్వాత దాదాపు 40 వేల మంది ఉద్యోగులు నియామకమయ్యారని.. వారికి కూడా 30 శాతం ఫిట్మెంట్ అమలు చేయాలని కోరినట్టు చెప్పారు. 61 ఏండ్లకు పదవీ విరమణ వయసు పెంపు ఆదేశాలను అన్ని ప్రభుత్వశాఖల్లోనూ అమలు చేయించాలని కోరామన్నారు. ఉద్యోగుల అరోగ్య భద్రత కోసం పీఆర్సీ సూచించిన విధంగా ఉద్యోగుల మూల వేతనం నుంచి ఒక్కశాతం వేతనాన్ని ప్రభుత్వ కార్పస్ఫండ్కు ఇవ్వడానికి ఉద్యోగులు, అధికారులు అంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల అరోగ్య భద్రత పథకాన్ని పటిష్టంగా అమలుచేయడానికి జీవో విడుదలచేయాలని, ఇటీవల ప్రకటించిన పీఆర్సీలో అనేక అంశాల్లో వ్యత్యాసాలున్నాయని, వాటి సవరణ కోసం అనామలీస్ కమిటీని ఏర్పాటుచేయాలని, కరోనా నేపథ్యంలో వ్యక్తిగత వాహనాల కొనుగోలుకు, పిల్లలకు ఆన్లైన్ క్లాసుల కోసం ల్యాప్టాప్లు, ట్యాబ్లు, సెల్ఫోన్లు, హౌస్బిల్డింగ్ అడ్వాన్స్ స్కీమ్ కింద రూ. 50 లక్షల వరకు గృహరుణాలు మంజూరు చేయించాలి కోరినట్టు తెలిపారు. వీటితోపాటు పలు సమస్యలను సీఎస్కు వివరించామని, వాటిని సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సీఎస్ను కలిసినవారిలో టీఎన్జీవో ప్రధాన కార్యదర్శి రాయికంటి ప్రతాప్, టీజీవో ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ, నేతలు కస్తూరి వెంకటేశ్వర్లు, ముజీబ్, ఎంబీ కృష్ణయాదవ్, రామ్, గండూరి వెంకటేశ్వర్లు, లక్ష్మణ్ తదితరులు ఉన్నారు.