శంకర్పల్లి: రంగారెడ్డి (Ragareddy) శంకర్పల్లిలో విషాదం చోటుచేసుకున్నది. ముగ్గురు పిల్లలను చంపిన తండ్రి.. తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. శంకర్పల్లి (Shankarpally) మండలంలోని టంగుటూరుకు చెందిన రవి (35) ‘మనీ స్కీ్మ్’ పేరుతో చుట్టుపక్కల గ్రామాల్లోని వారితో డబ్బులు కట్టించాడు. దీని ద్వారా రూ.వెయ్యికి రూ.3000, 58 రోజుల వ్యవధికి రూ.లక్షకు రూ.5 లక్షలు ఇప్పిస్తానంటూ డబ్బులు కట్టించాడు. తీరా డబ్బులు ఇవ్వకపోవడంతో కట్టిన వారంతా అతడిని అడగడం మొదలు పెట్టారు.
డబ్బులు ఇవ్వాలంటూ ఒక్కొక్కరుగా ఇంటికి రావడంతో ఏం చేయాలో తోచని స్థితిలో ముగ్గురు పిల్లలను చంపేసి తానూ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.