శంకర్పల్లి, మార్చి 4 : ఓ ప్రైవేటు సంస్థలో ఏజెంట్గా పనిచేస్తున్న వ్యక్తి తన ముగ్గురు కుమారులతో సహా ఆత్మహత్య చేసుకున్న ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని టంగటూరు గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం టంగటూర్కు చెందిన నీరటి రవికుమార్ అలియాస్ చిట్టి(35) ఏపీలోని విజయనగరం జిల్లా రాజాంకు చెందిన జీఎస్ఎస్ ఫౌండేషన్ సంస్థలో స్కీంల పేరిట వివిధ గ్రామాల్లో ప్రజల నుంచి డబ్బులు కట్టించాడు. రూ.1000 కడితే మూడు నెలల పాటు రూ.3000, రూ.లక్ష కడితే నెలకు రూ.50వేల చొప్పున 10 నెలల్లో రూ.5 లక్షలు వస్తాయని చెప్పడంతో చాలామంది స్కీం లో చేరారు. ఇలా దాదాపు రూ.2 కోట్లకు పైగా వసూలు చేసి డిపాజిట్ చేయించాడు. మొదట్లో క్రమం తప్పకుండా డబ్బులు చెల్లించిన సంస్థ మూడు నెలలుగా డబ్బులివ్వకపోవడంతో సంస్థలో చేరిన సభ్యులు రవికుమార్పై ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో భార్య లత రవికుమార్తో గొడవ పడి చిన్నకొడుకును వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
తీవ్ర మనస్తాపానికి గురైన రవికుమార్ ఆదివారం మొయినాబాద్ మండలం చిలుకూరులోని ఓ హాస్టల్లో చదువుతున్న తన ఇద్దరు కుమారులు సాయికిరణ్ (13), మోహిత్కుమార్(10)ను ఇంటికి తీసుకొచ్చి, చిన్న కుమారుడు ఉదయ్కుమార్ (7)కు సైతం ఇంట్లోనే నైలాన్ తాడు బిగించి హత్య చేశాడు. అనంతరం అతడు టంగటూరు శివారులో తాను నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్లో అర్ధరాత్రి ఉరేసుకున్నాడు. సోమవారం ఉదయం స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతుడి భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్సింగ్ ఏసీపీ రమణగౌడ్, సీఐ వీరబాబు తెలిపారు.