హత్నూర, డిసెంబరు 20 : చేపల వేటకు(Fishing) వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి తండ్రీకొడుకు మృతిచెందిన సంఘటన సంగారెడ్డి(Sangareddy) జిల్లా హత్నూర మండలం సాదుల్లానగర్ గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. బుధవారం గ్రామస్తులు, బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. చెక్కల ప్రభు (46), చెక్కల నాగరాజు (23) తండ్రీకొడుకులిద్దరూ మంగళవారం సాయంత్రం తుర్కలఖానాపూర్ గ్రామ శివారులోని చెరువులో చేపల పట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ప్రమాదవశాతు కాలు జారి నీటిలో పడి చేపల కోసం వేసిన వలలో వారు చిక్కుకుని అక్కడికక్కడే మృతిచెందారు.
రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు, గ్రామస్తులు వెతకినా ఆచూకీ లభించలేదు. బుధవారం మృతదేహాలు చెరువులో తేలాయి. హత్నూర ఎస్ఐ సుభాష్ శవ పంచనామా నిర్వహించి, పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ఏరియా దవాఖానకు మృతదేహాలను తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని బుధవారం నర్సాపూర్ ఎమ్మెల్యే వి.సునీతాలక్ష్మారెడ్డి నర్సాపూర్ ఏరియా దవాఖానలో పరామర్శించారు. ఆధైర్యపడవద్దని, ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందేలా చూస్తాని హామీ ఇచ్చారు.