రాయపర్తి, అక్టోబర్ 22: పండుగ కోసం ఓ తండ్రి తన కూతురు, అల్లుడిని బైక్పై ఇంటికి తీసుకొస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీకూతురు దుర్మరణం చెందారు. ఈ ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని వరంగల్- ఖమ్మం జాతీయ రహదారిపై శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్నది. మండలంలోని మొరిపిరాల గ్రామానికి చెందిన ఓరుగంటి వెంకన్న (49) సద్దుల బతుకమ్మ, దసరా పండుగ కోసం హైదరాబాద్లో నివాసం ఉంటున్న చిన్న కూతురు, అల్లుడిని తీసుకొచ్చేందుకు వెళ్లాడు. కూతురు ముంజంపల్లి అనూష (28), అల్లుడు రాజుతో కలిసి శనివారం రాత్రి హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో బయలుదేరి రాత్రి 11 గంటలకు తొర్రూరుకు చేరుకున్నారు. మొరిపిరాలకు వెళ్లేందుకు వాహనాలు అందుబాటులో లేకపోవడంతో తండ్రి వెంకన్న తన బైక్పై తీసుకు వస్తున్నారు.
ఈ క్రమంలో కిష్టాపురం క్రాస్ రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి తన కారును అతివేగంతో నడుపుతూ వెంకన్న ద్విచక్ర వాహనాన్ని వెనకాల నుంచి బలంగా ఢీకొట్టాడు. దీంతో వెంకన్నతోపాటు కుమార్తె అనూష అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న అల్లుడు రాజును స్థానికులు 108 వాహనంలో హనుమకొండలోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించారు. రాజు పరిస్థితి విషమంగానే ఉన్నట్టు తెలిసింది. మృతురాలు అనూషకు మూడేండ్ల కుమారుడు ఉండగా, ప్రస్తుతం ఆమె నాలుగు నెలల గర్భిణి. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో విషాదం నెలకొన్నది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.