కేంద్రం ఏకపక్ష నిర్ణయాలకు రాష్ర్టాల భవితవ్యం బలికావద్దు
బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ర్టాలపై మోదీ ప్రభుత్వం కక్ష
ఢిల్లీ, పంజాబ్ ముఖ్యమంత్రులతో భేటీలో సీఎం చంద్రశేఖర్రావు
ఏకీభవించిన అరవింద్ కేజ్రీవాల్, భగవంత్సింగ్ మాన్
జాతీయ రాజకీయాలపై ఏకధాటిగా రెండు గంటలపాటు సుదీర్ఘ చర్చ
హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఏకపక్ష, అనాలోచిత నిర్ణయాలతో భారత సమాఖ్యస్ఫూర్తి దెబ్బతింటున్నదని, ఈ పరిస్థితి మారాల్సిన అవసరం ఉన్నదని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అభిప్రాయపడ్డారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బీజేపీయేతర పార్టీల పాలిత రాష్ర్టాలపై కక్షగట్టిందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. ఇటువంటి పరిస్థితిని నిలువరించకపోతే దేశానికి పెనుముప్పు ఏర్పడుతుందని, భవిష్యత్తరాలు అనేక ఇబ్బందులపాలవుతాయని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్తో ఆదివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తి, దేశ ప్రగతిలో రాష్ర్టాల పాత్ర, కేంద్రప్రభుత్వ విధానాలు తదితర అంశాలపై వారు చర్చించారు. ఢిల్లీ సీఎం ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం 6-ఫ్లాగ్మార్గ్ సివిల్లైన్స్లోని అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి వెళ్లారు. ఉదయం 11.30 నుంచి దాదాపు రెండుగంటలపాటు జాతీయ రాజకీయాలపై వారు చర్చించారు. సీఎం కేసీఆర్ బృందానికి కేజ్రీవాల్ తన ఇంట్లోనే మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ తన ఢిల్లీ పర్యటన ఆంతర్యాన్ని ఆయనతో పంచుకున్నారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులపై వారిరువురూ విస్తృతంగా చర్చించారు.
రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన కేంద్రం అందుకు విరుద్ధంగా పనిచేస్తున్నదని, దీనివల్ల రాష్ర్టాల హక్కులు హరించుకుపోతున్న అంశంపై ఇద్దరు సీఎంలు సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఫక్తు రాజకీయపార్టీగా వ్యవహరిస్తున్న తీరుపై ఇద్దరు ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తంచేసినట్లు సమాచారం. ఎన్నికలు, అధికారమే పరమావధిగా కేంద్రం విధానాలు ఉండటం వల్ల అంతిమంగా ప్రపంచం ముందు దేశప్రతిష్ఠ దిగజారిపోతున్నదని వారు అభిప్రాయపడినట్టు తెలిసింది. ‘బలమైన కేంద్రం.. బలహీన రాష్ర్టాలు’ అనే కేంద్రం వైఖరిపై కేసీఆర్, కేజ్రీవాల్ విస్తృతంగా చర్చించినట్టు సమాచారం. ప్రజల ఎజెండాతో జాతీయ ప్రత్యామ్నాయ వేదిక నిర్మాణం అవసరమని, అందుకోసం భావసారూప్య ప్రాంతీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఉందనే అభిప్రాయానికి వారిరువురూ వచ్చినట్టు తెలుస్తున్నది. ప్రాంతీయ పార్టీలు తమ తమ రాష్ర్టాల ప్రయోజనాలను పరిరక్షించుకుంటూనే.. జాతిహితం కోసం పాటుపడాల్సిన అవసరాన్ని గుర్తించి, అందుకు అనువైన కార్యాచరణ రూపకల్పన జరగాలన్న సీఎం కేసీఆర్ సూచనకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అంగీకారం తెలిపినట్టు సమాచారం. దేశంలో జరుగుతున్న వర్గ హింస, మత విద్వేష రాజకీయాలకు కేంద్రం సహకరిస్తున్న తీరుపై ప్రధానంగా చర్చించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ భేటీలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు గడ్డం రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
జాతినిర్మాణంలో రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నా..
జాతి నిర్మాణంలో రాష్ట్రాల భాగస్వామ్యం ఉన్నా.. కేంద్రప్రభుత్వం రాష్ట్రాలను విస్మరిస్తున్నదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. సాయంత్రం సీఎం కేసీఆర్ పంజాబ్ సీఎం భగవంత్మాన్ అధికారిక నివాసంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్తో కలిసి భేటీ అయ్యారు. దేశ రాజకీయాలపై ముగ్గురు సీఎంలు విస్తృతంగా చర్చించారు. దేశాభివృద్ధి, రాష్ట్రాల భాగస్వామ్యం, రాష్ట్రాలపై కేంద్రం అనుసరిస్తున్న వివక్షాపూరిత వైఖరి వారి భేటీలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఎఫ్ఆర్బీఎం పరిధిని కేంద్రం కావాలనే కుదించిందని, ఫలితంగా రాష్ట్రాల ఆర్థిక పురోగతి కుంటుపడుతుందని అభిప్రాయపడిన ముగ్గురు ముఖ్యమంత్రులు.. ఈ విషయంలో రాష్ట్రాలు కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఉమ్మడి కార్యాచరణ రూపొందించే విధంగా అడుగులు వేయాలనే అభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం. పంజాబ్ రైతాంగంపై, అక్కడి వ్యవసాయ విధానాలపై కూడా ఈ సందర్భంగా కేసీఆర్ అక్కడి నేతలతో చర్చించారు. వ్యవసాయ రంగంలో పంజాబ్ అనుసరిస్తున్న విధానాలపై చర్చ జరిగినట్టు తెలిసింది.