హైదరాబాద్, ఏప్రిల్12 (నమస్తే తెలంగాణ) : ‘కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రత్యేకంగా మరోసారి ఒప్పందాలు చేసుకోవాల్సిందే. ఆ తర్వాతే పనులపై ముందుకెళ్తాం’ అని రాష్ట్ర ప్రభుత్వానికి నిర్మాణ ఏజెన్సీలు మరోసారి తేల్చిచెప్పాయి. అందుకు సర్కార్ సైతం సూత్రప్రాయంగా అంగీకరించినట్టు తెలుస్తున్నది. బరాజ్ల పునరుద్ధరణ అంశాలపై కొంతకాలంగా నిర్మాణ ఏజెన్సీలు, ప్రభుత్వానికి మధ్య ఏకాభిప్రాయం లేకుండాపోయింది. బరాజ్ల వైఫల్యానికి ఏజెన్సీలే కారణమని, మరమ్మతుల ఖర్చును మొత్తం అవే భరించాలని కాంగ్రెస్ సర్కార్ డిమాండ్ చేస్తున్నది. బరాజ్ల వైఫల్యంపై విచారణకు సర్కార్ నియమించిన జస్టిస్ ఘోష్ కమిషన్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, కేంద్రం ఏర్పాటు చేసిన ఎన్డీఎస్ఏ (నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ) నిపుణుల బృందం నివేదికలు మాత్రం ఎలాంటి స్పష్టమైన కారణాలు వెల్లడించలేదు. అసంబద్ధమైన నివేదికలు అందజేశాయి. బరాజ్ల వైఫల్యానికి తమ బాధ్యతే లేదంటూ ఏజెన్సీలు తేల్చిచెప్తున్నాయి. పునరుద్ధరణ ఖర్చును అదనంగా చెల్లించాల్సిందేనని, అందుకు మరోసారి ఒప్పందాలు చేసుకోవాలని పట్టుబడుతూ వస్తున్నాయి. దీంతో నిర్మాణ ఏజెన్సీలతో మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సచివాలయంలో తాజాగా భేటీ అయ్యారు. నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి శ్రీధర్, ప్రభుత్వ సలహాదారు ఆదిత్యానాథ్దాస్, ఈఎన్సీలు, సీఈలతో కలిసి ఏజెన్సీల ప్రతినిధులతో ఆయా అంశాలపై చర్చించారు. బరాజ్ల పునరుద్ధరణ పనుల పురోగతి అంశాలను సమీక్షించా రు. ఒప్పంద అం శాలపై నిర్ణయాలు తీసుకొన్నట్టు ఇరిగేషన్ వర్గాలు వెల్లడించాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్ల పునరుద్ధరణ పనులు వేగవంత చేయాలని అధికారులు, ఏజెన్సీ సంస్థలను రాష్ట్ర సాగునీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు. పనుల వేగవంతానికి నీటిపారుదల రంగ నిపుణులు కర్నల్ పరీక్షిత్ మెహ్రా కన్వీనర్గా ఉన్నతస్థాయి స్టీరింగ్ కమిటీని తక్షణమే ఏర్పాటు చేయాలని సూచించారు. వారానికి రెండుసార్లు సమావేశమై ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షించాలని, అందుకోసం ప్రత్యేక అధికారిని నియమించాలని దిశానిర్దేశం చేశారు. నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు, ఏజెన్సీలతో భేటీలో బరాజ్ల పునరుద్ధరణ పనుల పురోగతి అంశాలను సమీక్షించారు. నిర్దేశిత గడువులోనే అన్నారం, సుందిళ్ల పనులు పూర్తవుతాయని, అదే సమయంలో మేడిగడ్డలో కొంత భాగాన్ని పూర్తి చేయగలమనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. పుణెలోని కేంద్ర జల, విద్యుత్తు పరిశోధనా సంస్థ (సీడబ్ల్యూపీఆర్ఎస్) 45 రోజుల్లోగా సాంకేతిక పరీక్షలు నిర్వహించి నివేదికలను సమర్పిస్తుందని, అందుకు అనుగుణంగా ఏజెన్సీలు తమ శిబిరాలు, భోజన సదుపాయాలు, లాజిస్టిక్స్ను పునరుద్ధరించాలని, ఇంజినీర్లు, టెక్నీషియన్లు, రిగ్ ఆపరేటర్లకు వసతి, ఆహార సమస్యలు రాకుండా చూడాలని సూచించారు. ఇసుక తొలగింపు, జీపీఆర్ (భూభౌతిక) పరీక్షలు, సైట్ సిద్ధం పనులన్నీ ఏజెన్సీల పూర్తి సహకారంతో నిర్వహించాలని ఆదేశించారు.