నల్లగొండ : సీఎం కేసీఆర్ రైతు పక్షపాతిగా తీసుకుంటున్న నిర్ణయాలు బీజేపీకి కంటగింపుగా.. కడుపు మంటగా మారాయని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. బుధవారం నకిరేకల్ క్యాంప్ ఆఫీస్లో మీడియా సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ మీద తమకున్న అక్కసును బీజేపీ నేతలు రైతులపై దాడులతో ప్రదర్శిస్తున్నారని మండి పడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కి నల్లగొండ జిల్లా రైతులు ఈ గడ్డ పౌరుషం ఏమిటో చూపించారన్నారు. రైతులు అడుగుతున్న దానికి సమాధానం చెప్పకుండా బండి తొండి గుండా రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. ఏ జిల్లాకు వెళ్లినా బీజేపీ నేతలకు పరాభవం తప్పదు.
కేంద్రం వడ్లు మొత్తం కొంటాం అని ఆర్డర్ తీసుకురండి అంటే బండి అండ్ బ్యాచ్ బట్టేబాజ్ మాటలు మాట్లాడుతున్నారన ధ్వజమెత్తారు. బండి సంజయ్ వి నెత్తి కత్తి లేని మాటలు. తెలంగాణలో ధాన్యం సేకరణ జరుగుతున్న కొనుగొలు కేంద్రాలకు వెళ్లి ఏం చెప్పదలుచుకున్నారు? కేసీఆర్ ఒక ఎజెండా ఎత్తుకున్నారంటే అది గమ్యం చేరేదాకా పట్టువిడవని విక్రమార్కుడిలా పని చేస్తూనే ఉంటారన్నారు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసున్నారు.
రైతులకు శనిలా దాపురించిన బీజేపీ కథ తేల్చేవరకు సీఎం కేసీఆర్ ఇక తన పంతం వీడరని ఎమ్మెల్యే అన్నారు. తెలంగాణ రైతులు కేసీఆర్, టీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు. ఓట్ల కోసం చిల్లర వేషాలు వేస్తున్న బీజేపీ తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రేపు ఇందిరాపార్క్ లో జరిగే మహా ధర్నా ద్వారా బీజేపీకి మూడు చెరువుల నీళ్లు తాగిపిస్తామన్నారు.