భద్రాద్రి కొత్తగూడెం : నకిలీ విత్తనాలతో( Fake seeds) నష్టపోయిన తమకు న్యాయం చేయాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం తాళ్లపాయకు చెందిన గిరిజన రైతులు మంగళవారం ములకలపల్లిలోని బాలాజీ ఫెర్టిలైజర్స్(Fertilizers shop) ఎదుట పురుగు మందు డబ్బాలతో బైఠాయించి ఆందోళన(Farmers protested) నిర్వహించారు.
20 మంది రైతులు 40 ఎకరాల్లో యాసంగి వరి సాగు కోసం బాలాజీ ఫెర్టిలైజర్స్లో నాగార్జున సీడ్స్ వారి హెచ్ఎంటీ సోనా, ఆర్ఎన్ఆర్ వరి విత్తనాలు కొనుగోలు చేశారు. వీటిని సాగు కోసం వినియోగించగా.. వయసు రాకముందే ఈనిన పొలం అంతా తాలు కంకులు వేసింది. దీంతో నష్టపోయిన రైతులు తమకు న్యాయం చేయాలని కోరుతూ పురుగు మందు డబ్బాలతో దుకాణం ఎదుట ఆందోళన నిర్వహించారు.
పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం చేయకపోతే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటామని రైతులు పేర్కొన్నారు. కాగా, పది రోజుల క్రితం బాధిత రైతులు స్థానిక ఎమ్మెల్యేను కలిసి తమ గోడు విన్నవించుకున్నా.. నష్టపోయిన పంటలను, రైతులను కన్నెత్తి చూడకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. సంబంధిత అధికారులు స్పందించి న్యాయం చేయాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.