పెద్దపల్లి, మే 2 (నమస్తే తెలంగాణ)/ ధర్మారం: చెడపకురా చెడేవు.. అంటే ఇదే కావచ్చు. అసత్య ప్రచారంతో ఏదో రకంగా ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూస్తున్న కాంగ్రెస్ నేతలపై ప్రజలు తిరగబడుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఖిలావనపర్తి కొనుగోలు కేంద్ర వద్ద మంగళవారం జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనం. కాంగ్రెస్ నేత, జడ్పీ మాజీ చైర్మన్ అడ్లూరి లక్ష్మణ్కుమార్.. ఖిలావనపర్తిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ధర్నా చేసేందుకు వచ్చారు.
లక్ష్మణ్కుమార్ను రైతులు నిలదీశారు. అకాల వర్షానికి తడిసిన ధాన్యం కొంటామని సీఎం కేసీఆర్, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి ప్రకటించారని, ‘మధ్యలో మీ రాజకీయం ఏంటని’ మండిపడ్డారు. రాస్తారోకో, ధర్నా చేయడం వల్ల తమకు కలిగే ప్రయోజనం ఏంటని నిలదీశారు. సమాచారం అందుకున్న గ్రామ బీఆర్ఎస్ నాయకులు చేరుకొని రైతులకు సంఘీభావం తెలిపారు.