హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): వానకాలం పంటలపై ఎలాంటి ఆంక్షలు లేవని, రైతులకు ఇష్టమైన పంటలు పండించుకోవచ్చని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి తెలిపారు. అయితే వరితో పోల్చితే ఇతర పంటలు లాభదాయకంగా ఉండటంతో వాటి సాగుకు రైతులను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపారు. వానకాలం పంటలపై ఆంక్షలు పెడుతున్నారంటూ సాగుతున్న ప్రచారంపై స్పందిస్తూ గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వరిపై ఆంక్షలు లేవని, లాభసాటి పంటలు పండించేలా రైతులను ప్రోత్సహించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టంచేశారు.
రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్కు తీసుకుపోవడం కాకుండా, మార్కెట్టే రైతు కల్లం వద్దకు రావాలనేది సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని తెలిపారు. కొందరు స్వార్థపరులు ప్రభుత్వ లక్ష్యాన్ని వక్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం కిరికిరి పెట్టడం వల్లే ఆ సీజన్లో ఇతర పంటలు వేయాలని సూచించినట్టు తెలిపారు. వరితో పోల్చితే పత్తి, కంది, పెసర్లు, మినుము వంటి ఇతర పంటలకు మార్కెట్లో భారీ డిమాండ్ ఉండటంతోపాటు మద్దతుకు మించి ధర పలుకుతున్నదని వివరించారు. పత్తికి మద్దతు ధర రూ. 5,726 ఉంటే మార్కెట్లో రూ.12 వేలకు పైగా అమ్ముడుపోతున్నదని వెల్లడించారు. పెసర్లకు మద్దతు ధర రూ.7,275 ఉంటే మార్కెట్లో రూ. 7,600 వరకు ధర పలికిందని వివరించారు.