Huzurnagar | సూర్యాపేట : తెలంగాణలో సాగు, తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. తాగునీరు లేక తడిగొంతులు ఆరిపోతున్నాయి. కాంగ్రెస్ పాలనలో అటు అన్నదాతలు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వరి పంటకు నీళ్లు అందడం లేదని నీటి పారుదల శాఖ మంత్రి నియోజకవర్గంలో అన్నదాతలు నిరసనకు దిగారు. ఎండిపోతున్న వరి పొలాల్లో రైతులు నిలబడి తమ నిరసనను వ్యక్తం చేశారు.
హుజుర్నగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి.. రాష్ట్ర కేబినెట్లో నీటి పారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నియోజకవర్గ పరిధిలోని గరిడేపల్లి మండలంలోని కల్మలపల్లి గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఆయకట్టులో నీటి కొరత ఉందని రైతులు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాసంగి సీజన్కు క్రాప్ హాలిడే ప్రకటించడంతో తాము దిక్కుతోచని స్థితిలో ఉన్నామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే కొందరు రైతులు బోర్లపై ఆధారపడి వరిసాగు చేపట్టారు. కానీ బోర్లు కూడా ఎండిపోవడంతో.. వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. కనీసం సాగర్ లెఫ్ట్ కెనాల్ నుంచైనా నీరు విడుదల చేస్తే పంటలు బతికే అవకాశం ఉందన్నారు. ఈ క్రమంలో మిర్యాలగూడ, నాగార్జున సాగర్, హుజూర్నగర్, కోదాడ అసెంబ్లీ సెగ్మెంట్లలోని పంటలను కాపాడేందుకు సాగర్ ఎడమ కాల్వకు తక్షణమే నీటిని విడుదల చేయాలని రైతులు ప్రభుత్వాన్ని, నీటిపారుదల శాఖ మంత్రిని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రైతు ఆత్మహత్యలు తప్పవని, నీటి పారుదల శాఖ మంత్రి చొరవ తీసుకుని సాగర్ ఎడమ కాల్వకు నీటి విడుదలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఒప్పించాలని కోరారు.