తురపల్లి, జూన్ 5: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రిలోని కొనుగోలు కేంద్రం ఎదుట భువనగిరి-గజ్వేల్ ప్రధాన రహదారిపై రైతులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రెండు నెలల క్రితం గ్రామంలో కేంద్రాన్ని ఏర్పాటు చేసినా, కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండటంతో నేటికీ వందకుపైగా ధాన్యం కుప్పలు అలాగే నిలిచిపోయాయని అన్నారు. కేంద్రాల్లో నెలల తరబడి వేచి చూస్తున్నామని, ఇప్పటికే రెండు, మూడుసార్లు వర్షాలు పడి ధాన్యం మొలక వచ్చే పరిస్థితి వచ్చింది ఆందోళన వ్యక్తంచేశారు. అధికారులు వచ్చి ధాన్యం పరిశీలించి ఫొటోలకు పోజులు ఇస్తున్నారు తప్ప ధాన్యం తరలింపుపై శ్రద్ధ చూపడం లేదని మండిపడ్డారు.