తొర్రూరు : మహబూబాబాద్ జిల్లాలో మొక్కజొన్న పండించిన రైతులకు కష్టాలు మొదలయ్యాయి. సరైన సమయంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, కాంటా వేయడంలో జాప్యం వంటి కారణాలతో జిల్లాలోని మార్కెట్ యార్డులు మొక్కజొన్నలతో నిండిపోయాయి. గన్ని బ్యాగులు, లారీల కొరత తీవ్రంగా ఉండటంతో కొనుగోలు ప్రక్రియ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో మార్కెట్ యార్డులన్నీ మక్క బస్తాలతో కిక్కిరిసిపోయి, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తొర్రూరు పట్టణ కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో పరిస్థితి మరింత దారుణంగా మారింది. కాంటా వేసిన మొక్కజొన్నను పూర్తిస్థాయిలో తరలించకపోవడంతో రైతులు రోజులు తరబడి అక్కడే ఉండాల్సి వస్తోంది. సుమారు 5000 బస్తాల మక్క నిల్వ ఉండగా, లారీల కొరత కారణంగా వాటిని తరలించలేక పోతున్నామని అధికారులు స్వయంగా చెబుతున్నారు. అలాగే సుమారు 25 వేల గన్ని బ్యాగులు అవసరం ఉండగా, కేవలం 5000 బ్యాగులు మాత్రమే సరఫరా చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితులపై ఆగ్రహం చెందిన రైతులు సోమవారం మహబూబాబాద్ ప్రధాన రహదారిపై మొద్దులు అడ్డంగా పెట్టి రాస్తారోకో చేపట్టారు.
దీంతో రాకపోకలు పూర్తిగా స్థంభించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని రైతులను శాంతింపజేయడానికి ప్రయత్నించినప్పటికీ, రైతులు వెనక్కి తగ్గకుండా అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నెల రోజులుగా మార్కెట్లో పోసిన మక్కను కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంటా వేసిన బస్తాలను లారీల్లో ఎక్కించే వరకు రైతులే కాపలా కాస్తూ, తమ ఇళ్ల నుంచి భోజనం తెచ్చుకుని మార్కెట్ యార్డుల వద్దే రోజులు గడపాల్సి వస్తోందని వాపోతున్నారు.
గన్ని బ్యాగుల కొరత కూడా రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కొనుగోలు కేంద్రాలను సక్రమంగా నిర్వహించాలని, అవసరమైన గన్ని బ్యాగులు, లారీలు అందుబాటులోకి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నారు.