సిద్దిపేట, మార్చి 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ‘తెలంగాణ నుంచి వడ్లు కేంద్రం కొనేపరిస్థితి లేదు. బియ్యం ఇక నుంచి కొనుగోలు చేయబోం. ఇక మీ ఇష్టం’ అని కేంద్ర ప్రభుత్వం నిక్కచ్చిగా చెప్పిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. పంట మార్పిడి పాటించకపోతే రైతులు భవిష్యత్తులో బాగా నష్టపోతారని పేర్కొన్నారు. వరి వేస్తే నీటి సమస్యతోపాటు వడగండ్ల వర్షాలతో ఇబ్బందులు ఎదురవుతున్నట్టు చెప్పారు. లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఉద్యాన, వాణిజ్య పంటలు వేసుకోవాలని, వరి మాత్రం సాగు చేయొద్దని సూచించారు. శనివారం సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్పామ్ ఫ్యాక్టరీని రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయిల్ఫెడ్ అధికారులతో కలిసి తుమ్మల పరిశీలించారు. ఫ్యాక్టరీ ప్రారంభానికి రాష్ట్రం నలుమూలల నుంచి రైతులు వస్తారని, మూడు రోజులపాటు రైతు మేళా నిర్వహిస్తామని చెప్పారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశంలోనే అత్యధికంగా తెలంగాణలోనే వరి సాగు అవుతుందని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడు ఇంత వరి పండిన సందర్భం లేదని, పంజాబ్లోనూ వరి ఇంతగా లేదని పేర్కొన్నారు. వరి వేయడం వల్ల అందరికి కష్టాలు తెచ్చే పరిస్థితి వస్తుందని తెలిపారు. అందుకే పంటల మార్పిడి తప్పనిసరి అని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణలో ఆయిల్పామ్ తప్ప మరో పంట లేదని చెప్పారు. అర్జెంట్గా ఇంత ఆదాయం వచ్చే మరో పంట లేదని పేర్కొన్నారు. నర్మెట ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ఈనెల 22న సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించనున్నట్టు మంత్రి తుమ్మల తెలిపారు.
ఏప్రిల్ నుంచి సీజన్ ప్రారంభమవుతుందని చెప్పారు. ఉత్తర తెలంగాణతోపాటు మిగతా జిల్లాల నుంచి వచ్చే పంట మొత్తం నర్మెట ఫ్యాక్టరీకే రావాల్సి ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో పండే ప్రతి గెలా నష్టపోకుండా ప్రాసెస్ చేసే విధానం ఇక్కడ ఉన్నదని తెలిపారు. తెలంగాణలో క్రూడాయిల్ ఉన్నప్పటికీ రిఫైండ్ లేదని, సీఎంను అడిగి రిఫైండ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోబోతున్నామని చెప్పారు. అదేరోజు దానికి భూమి పూజ చేస్తామని వెల్లడించారు.