భద్రాద్రి- కొత్తగూడెం జిల్లా,మే 8 : రైతులు ఆయిల్ పామ్ సాగు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలి. ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలం. దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చే ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కోసం నిర్మల్ జిల్లా రైతులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. తొలుత దమ్మపేట గ్రామంలో పామాయిల్ కర్మాగారాన్ని సందర్శించారు. పంటను రైతులు ఆయిల్ పామ్ గింజలను ఫ్యాక్టరీకి ఎలా తరలిస్తున్నారు? తీసుకు వచ్చిన ఆయిల్ పామ్ గెలల ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది? టన్నుకు నూనె దిగుబడి ఎంత వస్తుంది? అనే వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అల్లిపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ నర్సరీని పరిశీలించారు. మొక్కలను ఎలా పెంచుతున్నారు ? సాగులో ఎటువంటి పద్ధతులు పాటించాలి ? ఎటువంటి ఎరువులను వాడాలి ? ఆయిల్ పామ్ దిగుబడి సంవత్సరంలో ఏ నెలల్లో అధికంగా వస్తుంది ? అని సంబంధిత అధికారులు, నర్సరీ నిర్వాహకులను అడిగి తెలుసుకోవడంతో పాటు ఇతర అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..పండించిన పంటకు గిట్టుబాటు ధర వచ్చి రైతులు ఆర్థికంగా బలపడాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ఆయిల్ పామ్ల్ పంటలు వేయాలని ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. మార్కెట్లో వంట నూనెల డిమాండ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసిందన్నారు.
వచ్చే జూన్ తర్వాత 3 లక్షల ఎకరాలలో సాగు చేసేందుకు రైతులకు మొక్కలు సిద్ధంగా ఉంచారన్నారు.
నిర్మల్ జిల్లాలో వానాకాలంలో 3 వేల ఎకరాలు, యాసంగిలో 7 వేల ఎకరాల ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా మొక్కలు బిందు సేద్య పరికరాలు, అంతర పంటలకు విత్తనాలను అందజేస్తుందని మంత్రి వెల్లడించారు.
రానున్న రోజుల్లో మార్కెట్ అంచనాల మేరకు ఆయిల్ పామ్ ధర పెరిగే ఛాన్స్ ఉందని తెలిపారు. ఆయిల్ పామ్ చెట్టు జీవిత కాలం సగటున 30- 40 సంవత్సరాలు కాగా అప్పటి వరకు పంట కాస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అశ్వరావు పేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వర్ రావు, నిర్మల్ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వెంకట్రామ్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంజి ప్రసాద్, ఎంపీపీలు రామేశ్వర్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.