సిద్దిపేట : గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీగా ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి హరీశ్ రావు అన్నారు. సోమవారం ఐడీవోసీ (IDOC) మీటింగ్ హాల్లో ఆర్డీవోలు, జిల్లా అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, పాక్స్ చైర్మన్ లు, వ్యవసాయ అధికారులు, ఏపీఎంలు, రైస్ మిల్లర్లు, కొనుగోలు కేంద్ర బాధ్యులు, రైతు బంధు సమన్వయ సమితి సభ్యులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఒక లక్షా 22 వేల 989 హెక్టార్ లలో వరి సాగు చేయగా గతంలో ఎన్నడూ లేనివిధంగా 7 లక్షల 62 వేల 533 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో ఐకేపీ ఆధ్వర్యంలో 225, ప్యాక్స్ ఆధ్వర్యంలో 156, AMC ఆధ్వర్యంలో 10, మెప్మా ఆధ్వర్యంలో 05 మొత్తం 396 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఇప్పటికే వీటిలో 265 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామని, వచ్చే రెండు, మూడు రోజుల్లో మిగతా అన్ని కేంద్రాలను తెరుస్తామని మంత్రి తెలిపారు. ప్రభుత్వం గ్రేడ్ -A రకం ధాన్యం కు క్వింటాల్కు రూ.1960, అలాగే కామన్ రకానికి రూ.1940 కనీస మద్దతు ధరగా అందజేస్తున్నారు.ధాన్యం కొనుగోలు సజావుగా జరిగేందుకు ఇప్పటికే మిల్లర్లు, ట్రాన్స్ఫోర్ట్ యజమానులు, సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని మంత్రి తెలిపారు.
వానాకాలంలో అత్యధిక విస్తీర్ణంలో వరి పంట సాగు కావడంతో పాటు దిగుబడి కూడ అధికంగా రానున్న దృష్ట్యా ధాన్య కొనుగోలును అధికారులు, ప్రజాప్రతినిధులు సవాలుగా తీసుకొని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు.ఈ సందర్భంగా మంత్రి మిల్లర్ల వైపు నుంచి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందన్నారు.
యాసంగిలో పారా బాయిల్డ్ రైస్ కొనాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ మూడు సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి విన్నవించినా ఫలితం లేకుండా పోయిందని మంత్రి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో పేదలకు రేషన్ బియ్యం అందజేసేందుకు అవసరమైన బియ్యాన్నే పౌర సరఫరా సంస్థ కొనుగోలు చేస్తుందన్నారు.
అంతకు మించి కొనడం సాధ్య పడదన్నారు. తెలంగాణలో దక్షిణాది రాష్ట్రాలకు సరిపడా ధాన్యం దిగుబడి వస్తుందన్నారు. ఇంత పెద్ద స్థాయిలో వచ్చే ధాన్యం కొనుగోలును ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేయాల్సి ఉంటుందన్నారు. ఎఫ్సీఐ కొనుగోలు సమయంలో రైస్ మిల్లర్లు పడుతున్న ఇబ్బందులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తామని మంత్రి తెలిపారు.
సమావేశంలో జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ, సతీష్ కుమార్, యాదగిరి రెడ్డి, రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ వెంకట్రామ రెడ్డి, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వంగా నాగిరెడ్డి, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ వంటే రు ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.