ఇల్లంతకుంట రూరల్, ఫిబ్రవరి 11: రంగనాయకసాగర్ ఎల్ఎం-6 కెనాల్ కిలోమీటరున్నర మేరకు కాలువ తవ్వి సాగునీళ్లివ్వకుంటే ఆమరణ దీక్ష చేస్తామ ని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామాల రైతులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మండలంలోని పెద్దలింగాపూర్ శివారులో గల సబ్స్టేషన్ సమీపంలో రైతులు చేపట్టిన రిలేదీక్ష బుధవారం రెండో రోజుకు చేరింది. కాలువ నిర్మాణం జరిగే వరకు తమ ఉ ద్యమం ఆగదని, 15 రోజుల్లోగా పనులు మొదలుపెట్టే వరకు దీక్ష కొనసాగిస్తామ ని స్పష్టంచేశారు. నిరుడు కాలువ కోసం పెద్దలింగాపూర్, రామోజిపేట, చిక్కుడువానిపల్లి, తంగళ్లపల్లి మండలంలోని నర్సింహులపల్లి, చిన్నలింగాపూర్, బ స్వాపూర్, అంకుశాపూర్, లక్ష్మీపూర్, పా పయ్యపల్లి, ఎడ్లోనికుంట, బాలమల్లుపల్లి గ్రామాల రైతులు 19 రోజులు రిలేదీక్ష చేయగా మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మూడు నెలల్లో పూర్తి చేయిస్తామని, రైతులకు రూ.3.20 కోట్ల పరిహారం ఇప్పిస్తామని హామీ ఇచ్చి న విషయాన్ని గుర్తుచేశారు. కానీ, ఇప్పటివరకు పైసా ఇవ్వలేదని, తట్టెడు మట్టి తియ్యలేదని మండిపడ్డారు. నిరుడు యాసంగిలో సాగు చేసిన పంటలన్నీ చివరి దశలో నీళ్లులేక ఎండిపోయాయని, ఈ ఏడాది కూడా అదే పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉన్నదని చెప్పారు. కలెక్టర్, ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు విన్నవించినా పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తంచేశారు.