Mulugu | ములుగు, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : పంట పెట్టుబడి సాయం తమకు అందలేదని మంత్రి సీతక్కను రైతులు నిలదీశారు. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం కేశవాపూర్లో శుక్రవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఉపాధి హామీ కూలీల వద్దకు వెళ్లి కాంగ్రెస్కు ఓటు వేయాలని అభ్యర్థిస్తుండగా గ్రామానికి చెందిన రైతు జంబుల నర్సయ్య రైతుబంధు విషయమై మండిపడ్డారు. తనకు మూడు ఎకరాల భూమి ఉన్నదని, పెట్టుబడి సాయం ఎందుకు అందించడం లేదని మంత్రిని నిలదీశారు.
గ్రామ ముఖ్య నాయకులను ఉద్దేశించి నర్సయ్య మాట్లాడుతూ.. రైతుబంధు పైసలు ఎందుకు పడలేదో అడగాలని కోరుతూ మంత్రి ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో అక్కడ ఉన్న మహిళలు సైతం ఆరు గ్యారెంటీలపై నిలదీశారు. చేసేదేమీ లేక మంత్రి సీతక్క ప్రసంగాన్ని ఆపి రైతు బంధు పైసలు బ్యాంకులో సమస్య వల్ల పడకపోవచ్చని, బ్యాంకుకు వెళ్లి చూసుకోవాలని సముదాయించి వెనుదిరిగారు.