ఖమ్మం, మే 28 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/బోనకల్లు, మే 28: మొక్కజొన్న బస్తాలు తరలించడానికి లారీలు వస్తలేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఎదుట రైతులు గోడు వెల్లబోసుకున్నారు. ఖమ్మం జిల్లా బోనకల్లు మండలంలో గురువారం ఆయన పర్యటించారు. ప్రభుత్వం సకాలంలో లారీలు పంపించకపోవడంతో తామే సొంతంగా ప్రైవేట్ లారీలను ఆశ్రయించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. దీని కోసం ఒకో బస్తాకు రూ.70 నుంచి రూ.80 వరకు అదనంగా ప్రైవేట్ లారీ యజమానులకు చెల్లిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం లారీలను ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కోరారు.
ఇందుకు డిప్యూటీ సీఎం స్పందిస్తూ రైతుల ప్రశ్నలకు తక్షణమే సమాధానం చెప్పాలని అక్కడే ఉన్న ఖమ్మం కలెక్టర్ దివాకరను ఆదేశించారు. దీంతో కలెక్టర్ స్పందిస్తూ మొకజొన్న బస్తాలను తరలించే బాధ్యత పూర్తిగా ప్రభుత్వానిదేనని తెలిపారు. లారీ యజమానులకు రైతులు ఒక రూపాయి కూడా ఇవ్వొద్దని సూచించారు. లారీల యజమానులు డబ్బులు అడిగితే నేరుగా తనకే సమాచారం అందించాలని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతుల వద్ద సేకరించిన మొత్తం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కనీస మద్దతు ధరకు కొనాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలులో కేంద్రం జాప్యం చేయడంపై రాష్ర్టానికి చెందిన కేంద్ర మంత్రులు నోరు మెదపడం లేదని, కానీ కల్లాల బాట పట్టడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ధాన్యం మొత్తం కొనేలా కేంద్ర ప్రభుత్వాన్ని కిషన్రెడ్డి, బండి సంజయ్ ఒప్పించాలని డిమాండ్ చేశారు.