చివ్వేంల(సూర్యాపేట) : ఎస్సారెస్పీ వరద కాల్వ(Srsp canal) ద్వారా పంట పొలాలకు సాగునీటిని అందిం చాలని, కండ్ల ముందే పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోవడం బాధాకరమని గ్రామీణ పేదల సంఘం జిల్లా అధ్యక్షుడు కొనకంచి వీరభద్రయ్య అన్నారు. ఎస్సారెస్పీ కాల్వల ద్వారా నీటిని విడుదల(Water release) చేసి పంట పొలాలకు సాగునీటిని అందించాలని మండలంలోని మొగ్గయ్యగూడెం గ్రామంలో రైతులతో కలిసి ఎస్సారెస్పీ కాల్వ వద్ద నిరసన(Farmers protest) వ్యక్తం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..మాయమాటలు చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రైతులను మోసం చేస్తున్నదని మండిపడ్డారు.
కాల్వ వస్తుందనే ఆశతో నాట్లు వేశామని ఇప్పుడు నీరు ఇవ్వకుంటే రైతులకు ఎకరాకి రూ.25 వేల నష్టం వాటిల్లితుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. శ్రీరాంసాగర్ రిజర్వాయర్ నిండా నీళ్లు నిల్వ ఉన్నా సాగునీరు విడుదల ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సాగుచేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందన్నారు.
అధికారులకు ఎన్నిసార్లు మెరపెట్టుకున్నా కనికరం చూపిస్తలేరని ఆవేదన వ్యక్తం చేశారు. పంటల కోసం పెట్టిన పెట్టుబడులు భారంగా మారాయన్నారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించి పంట పొలాలలకు సాగు నీరు అందివ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఓ జిల్లా కార్యదర్శి భాషిపంగు సునీల్, అనంతుల యల్లయ్య, వెంకన్న, ఉప్పలయ్య, వెంకటనర్సు, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.