కథలాపూర్, మార్చి 30 : వరద కాలువలోకి నీటిని వదలాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలంలోని బొమ్మెన, తక్కళ్లపెల్లి, భీమారం మండలం మన్నెగూడెం గ్రామాల రైతులు శనివారం కథలాపూర్ శివారులోని వరద కాలువ బ్రిడ్జిపై ధర్నా చేశారు. వరదకాలువలో నీళ్లు లేకపోవడంతో చేతికందే వరి పంట ఎండిపోతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నివించుకున్నా ఫలితం లేదని ఆవేదన చెందారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వరదకాలువ నిండా నీటితో కళకళలాడి పంటలు పుష్కలంగా పండేవని తెలిపారు. ప్రస్తుతం వరద కాలువలో నీళ్లు లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని వాపోయారు.
రైతులు ధర్నా చేస్తున్న సమయంలో అటుగా వెళ్తున్న ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ వారి వద్దకు వచ్చి సమస్యను అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడామని, వరదకాలువలోకి నీళ్లు వదిలినట్టు రైతులకు తెలిపారు. నీళ్లు కథలాపూర్ వరకు చేరితేనే ధర్నా విరమిస్తామని వారు భీష్మించారు. ఎస్సై నవీన్ కుమార్ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో మెట్పల్లి మండలం జగ్గసాగర్ గ్రామశివారులోని వరదకాలువకు గల గేట్ ద్వారా నీళ్లను వదిలారు. దీంతో రైతులు ధర్నాను విరమించారు. రైతులు గంటసేపు బైఠాయించడంతో కోరుట్ల – వేములవాడ రోడ్డుకు ఇరువైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.