ముస్తాబాద్, ఫిబ్రవరి 21 : సాగు నీళ్ల కోసం రైతులు ఆందోళనకు దిగారు. మల్లన్నసాగర్ నుంచి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ పెద్ద చెరువుకు వస్తున్న నీరు మరో మూడు ఫీట్లు పెరిగిన తరువాత దిగువన ఉన్న నక్క వాగుకు వదిలి పంటలను కాపాడాలని పలు గ్రామాల రైతులు శుక్రవారం ముస్తాబాద్లో ఎండలో ప్రధాన రహదారిపై బైఠాయించారు. నక్కవాగు పరిసర గ్రామాలైన పోతుగల్, గన్నెవానిపల్లె, నర్సింహులతండా, మామిండ్లవారిపల్లె, నిమ్మలవారిపల్లె, తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేట గ్రామాల రైతులు తాము వేసిన వరి పంట నీళ్లు లేక వాడి పోతున్నదని, పొలం పగుళ్లు చూపుతున్నాయని, వెంటనే నీరందించకపోతే పశువుల మేతకు వదలాల్సి వస్తుందని వారం రోజులుగా అధికారులకు విన్నవిస్తున్నారు. దీనిపై నీటి పారుదల శాఖ అధికారులు శుక్రవారం ముస్తాద్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీలో ముస్తాబాద్, పోతుగల్ పరిసర గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు.
ఇందులో ముస్తాబాద్కు చెందిన నా యకులు, రైతులు మల్లన్నసాగర్ నుంచి ముస్తాబాద్ పెద్ద చెరువుకు వస్తున్న నీరు మరో మూడు ఫీట్లు పెరిగిన తరువాత దిగువకు వదలాలని పట్టుబట్టడంతో అధికారులు సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఆగ్రహించిన రైతులు సిద్దిపేట- కామారెడ్డి ప్రధాన రహదారిపైకి వచ్చి అధికారుల తీరును నిరసిస్తూ బైఠాయించారు. దీంతో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో తహసీల్దార్ సురేశ్కుమార్ అక్కడికి రాగా, మల్లన్నసాగర్ నుంచి వచ్చే నీటిని దిగువకు వదిలి పంటలను కాపాడాలని రైతులు వేడుకున్నారు. వెంటనే తహసీల్దార్ నీటి పారుదలశాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ముస్తాబాద్ పెద్ద చెరువులోకి మూడు రోజుల్లో ఎక్కువ నీరు వచ్చేలా చూస్తామని నీటిపారుదల శాఖ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.