కడెం, ఏప్రిల్ 11 : సాగు నీటి కోసం రైతులు రోడ్డెక్కారు. సదర్మాట్ నీటిని విడుదల చేయాలని పలుమార్లు విన్నవించినా అధికారులు పట్టించుకోక పోవడంతో గురువారం నిర్మల్ జిల్లా కడెం మండలంలోని నచ్చన్ఎల్లాపూర్ వద్ద నిర్మల్-మంచిర్యాల ప్రధాన రహదారిపై లింగాపూర్ గ్రామానికి చెందిన రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులను ఇబ్బందులు పెడుతున్నదని మండిపడ్డారు. సదర్మాట్ ఆయకట్టుకు నీరు ఇచ్చే విషయంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు. చేతికొచ్చిన పంటలు, పెట్టుబడులను నాశనం చేయడమే సర్కార్ లక్ష్యమా? అని ప్రశ్నించారు. యాసంగి సాగుకు సదర్మాట్ నుంచి అధికారులు నీటిని విడుదల చేయడంతో పెట్టుబడులు పెట్టి, పంటలు సాగు చేసినట్టు తెలిపారు.
30 టీఎంసీల నీళ్లు ఉన్నాయని, సాగు చేసుకోవచ్చని స్వయం గా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు హామీ ఇవ్వడంతోనే సాగు చేశామని వారు పేర్కొన్నారు. పంట చేతికందే సమయంలో నీటి విడుదల నిలిపివేశారని మండిపడ్డారు. విషయం తెలుసుకున్న కడెం ఎస్సై కృష్ణసాగర్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని రైతులతో మాట్లాడారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జు.. హుటాహుటిన కడెం మండల కేంద్రానికి చేరుకొని సదర్మాట్ నీటిని విడుదల చేయించారు. ప్రస్తుతం ఆ కాలువకు కేవలం 500 క్యూసెక్కుల నీటిని మాత్రమే విడుదల చేశారని, 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తేనే చివరి ఆయకట్టు వరకు చేరుతాయని రైతులు, నాయకులు ధర్నా అనంతరం పేర్కొన్నారు. ఈ నీటిని కూడా కేవలం 3 రోజులే విడుదల చేసి, తప్పించుకునే ప్రయత్నమే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.