అమరచింత, జూలై 7 : మంత్రి వాకిటి శ్రీహరికి రైతుల నుంచి నిరసన సెగ తగిలింది. మంగళవారం వనపర్తి జిల్లా అమరచింత మండలంలో రూ.6 కోట్లతో చేపట్టనున్న చంద్రఘడ్ ఎత్తిపోతల పథకం మరమ్మతులకు మంత్రి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతుండగా.. ఈర్లదిన్నెకు చెందిన రైతులు హన్మంతురెడ్డి, వెంకట్రెడ్డి హామీలపై నిలదీశారు. మక్తల్ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నెలలోపు మండలంలోని అన్ని గ్రామాలకు బీటీ రోడ్లు వేయించడంతోపాటు భూత్పూర్ కెనాల్ నుంచి ఈర్లదిన్నె, మిట్టనందిమళ్ల గ్రామాల రైతులకు సాగునీరు అందిస్తానని హామీ ఇచ్చి రెండేండ్లు గడిచినా నెరవేరలేదని గుర్తుచేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని అక్కడి నుంచి తోసేయడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొన్నది. ఆత్మకూరు సీఐ శివకుమార్, అమరచింత ఎస్సై స్వాతి వారికి నచ్చజెప్పారు.