నల్లగొండ: నల్లగొండ పర్యటనలో ఉన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి (Bandi Sanjay) నిరసన సెగ తగిలింది. నల్లగొండ టౌన్లోని ఆర్జాల బావి ఐకేపీ కేంద్రం వద్ద బండికి రైతులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ధాన్యం సేకరణపై బీజేపీ స్పష్టమైన వైఖరి చెప్పాలంటూ రైతులు ధర్నాకు దిగారు. బండి సంజయ్ గో బ్యాక్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
ఐకేపీ కేంద్రంలో ధాన్యం రాశులను పరిశీలించడానికి బండి సంజయ్ నల్లగొండకు వెళ్లారు. ఈ క్రమంలో రైతులు ఆయనను అడ్డుకున్నారు. ధాన్యం కొనుగోలుపై ఆయనతో వాగ్వాదానికి దిగారు. యాసంగి వడ్లు కొంటామని ప్రధాని మోదీతో ప్రకటన చేయించాలని డిమాండ్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు.