హైదరాబాద్ : ‘రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి’ అంటూ ఉగాది పండుగ సందర్భంగా రైతులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే) గ్రామంలో ‘కేసీఆర్ సారే కావాలి’, ‘మళ్లీ కారే రావాలి’ అని రాసి ఉన్న పోస్టర్లను రైతులు ప్రదర్శించారు.
కాంగ్రెస్ పాలనలో రైతుభరోసా లేక, రుణమాఫీ కాక, కరెంట్ సరిగ్గా రాక రైతుల బతుకులు ఆగమయ్యాయని, మళ్లీ కేసీఆర్ వస్తేనే రైతులకు నిజమైన పండుగ అని రైతులు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు డిక్లరేషన్ పేరిట మోసం చేసిందని విమర్శించారు. కేసీఆర్ పాలనలో రైతులకు టింగ్ టింగ్ అంటూ పంట పెట్టుబడికి రైతుబంధు వచ్చేదని, కాంగ్రెస్ పాలనలో పథకాలు కాగితాలకే పరిమితమవుతున్నాయని ముక్రా (కే) గ్రామ రైతులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ గాడ్గే మీనాక్షి, మాజీ ఎంపీటీసీ గాడ్గే సుభాష్, విట్టల్, దత్త, వెంకటి, సంతోష్, మారుతి, రావ్ సాబ్, పలువురు మహిళలు పాల్గొన్నారు.