దుబ్బాకటౌన్/మిరుదొడ్డి, ఫిబ్రవరి 1: సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు. మల్లన్నసాగర్ ద్వారా కూడవెల్లి వాగులోకి కాళేశ్వర జలాలను వదలాలని డిమాండ్ చేస్తూ గురువారం అక్బర్పేట్-భూంపల్లిలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో చేశారు. బీఆర్ఎస్ మిరుదొడ్డి మండల అధ్యక్షుడు జీడిపల్లి రవి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు సంక్షేమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. దుబ్బాక నియోజకవర్గ రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని కేసీఆర్ సర్కార్ మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మిస్తే, దాని ద్వారా నీటిని విడుదల చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు.